ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్లో ఓటమి పాలైన సన్రైజర్స్.. ఇప్పుడు పంజాబ్పై ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.
అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓ కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశముంది. గత మ్యాచ్లో విఫలమైన స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్పై వేటు వేసేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు లివింగ్స్టోన్ను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.
కానీ తొలి రెండు మ్యాచ్లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అయితే లక్నో జరిగిన మ్యాచ్కు మాత్రం లివింగ్స్టోన్కు తుది జట్టులో చోటు దక్కింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. దీంతో పంజాబ్తో మ్యాచ్కు అతడిని పక్కన పెట్టేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది.
అతడి స్ధానంలో మరో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్కు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి మూడు మ్యాచ్లకు స్వల్ప గాయం కారణంగా బెంచ్కే పరిమితమైన కార్స్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
దీంతో బ్రైడన్ కార్స్ ఐపీఎల్ అరంగేట్రం దాదాపు ఖాయమైనట్లే. ఇదొక్కటి మినహా ఎస్ఆర్హెచ్ జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోపోవచ్చు. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న పంజాబ్ను ఎస్ఆర్హెచ్ ఎలా ఎదుర్కొంటుందో ఎదురు చూడాలి.
చదవండి: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో!


