బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి ముందు ఎలాంటి ప్రత్యేక వేడుకలు నిర్వహించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా... తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది.
గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ట్రోఫీ చేజిక్కించుకోగా... విజయోత్సవాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తాజా సీజన్ ఆరంభానికి ముందు చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే లీగ్ ఆరంభ మ్యాచ్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
‘గతేడాది జూన్ 4న జరిగిన విషాద ఘటన నేపథ్యంలో... ఈసారి సీజన్ ఆరంభానికి ముందు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీనికి బదులు మే 31న ఐపీఎల్ ఫైనల్ రోజు ఘనంగా సంబరాలు నిర్వహిస్తాం’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.


