చరిత్ర సృష్టించిన సుయాశ్‌ శర్మ | IPL 2026: Suyash Sharma Leaves Legends Behind With Historic IPL Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సుయాశ్‌ శర్మ

Apr 28 2026 5:24 PM | Updated on Apr 28 2026 5:31 PM

IPL 2026: Suyash Sharma Leaves Legends Behind With Historic IPL Record

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 27) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ ప్రత్యర్దిని 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది.

ఢిల్లీని 75 పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4), రసిక్‌ సలాం దార్‌ (2-0-21-1), సుయాశ్‌ శర్మ (4-1-7-1), కృనాల్‌ పాండ్యా (2-0-9-1) కీలకపాత్ర పోషించారు. వీరిలో భువీ, హాజిల్‌వుడ్‌ ఆరంభంలో చెలరేగగా.. ఆతర్వాత సుయాశ్‌ శర్మ పేట్రేగిపోయాడు. ఈ క్రమంలో సుయాశ్‌ చారిత్రక ప్రదర్శన నమోదు చేశాడు.

తన కోటా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చిన సుయాశ్‌, ఓ వికెట్ కూడా పడగొట్టాడు. అంతేకాదు, తన స్పెల్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో సంయుక్తంగా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా అతడిని నిలిపింది. 

ఈ ఘనతను ఇంతకుముందు దీపక్‌ చాహర్‌ సాధించాడు. చాహర్‌ 2019 ఎడిషన్‌లో సీఎస్‌కేకు ఆడుతూ కేకేఆర్‌పై ఈ చారిత్రక గణాంకాలు నమోదు చేశాడు. ఇక్కడ దీపక్‌ చాహర్‌ పేస్‌ బౌలర్‌ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా సుయాశ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి టాప​-5 బౌలర్లలో సుయాశ్‌ ఒక్కడే స్పిన్నర్‌గా ఉన్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్లు (టాప్‌-5)
సుయాశ్‌ శర్మ- 20
దీపక్‌ చాహర్‌- 20
ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌- 19
జహీర్‌ ఖాన్‌- 19
మహ్మద్‌ షమీ- 19

కాగా, ఈ చారిత్రక ప్రదర్శనలో సుయాశ్‌ ఇచ్చిన 7 పరుగుల్లో 3 వైడ్ల రూపంలో వచ్చాయి. ఇవి కూడా వేయకపోయుంటే సుయాశ్‌ ఐపీఎల్‌లో అత్యంత​ పొదుపైన స్పెల్‌ వేసిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కేవాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్‌ మధ్య ఓవర్లలో పరుగులకు పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. ఢిల్లీ ఏడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ ఏప్రిల్‌ 30న జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement