ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ భారీ టార్గెట్ను పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభ్సిమ్రాన్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. సన్రైజర్స్ బౌలర్లలో స్పిన్నర్లు శివాంగ్ కుమార్ మూడు, హర్ష్ దూబే ఓ వికెట్ సాధించారు. ఫాస్ట్ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని కిషన్ తెలిపాడు.
"మేము సాధించిన 219 పరుగుల భారీ స్కోర్ ఈ రోజు సరిపోలేదు. మేము ఆరంభించిన తీరు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో తడబడ్డాం. అయినప్పటికి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని అందించాము.
కానీ పంజాబ్ ఓపెనర్లు కూడా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లేలో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. జట్టులో ఆరు నుండి ఏడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. టీ20 క్రికెట్లో సరైన లైన్ అండ్ లెంగ్త్లో వేయడం ముఖ్యం. కానీ ఈ రోజు ఆ విషయంలో విఫలమయ్యారు. ప్రస్తుత క్రికెట్లో మ్యాచ్కు ముందే ప్లానింగ్ అంతా పూర్తవుతుంది.
ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు? మైదానంలో ఏ వైపు బౌండరీ లాంగ్ ఉంది? వంటి విషయాలన్నీ మాకు తెలుసు. వీటిన్నటి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేశాము. కానీ ప్లానింగ్ సరిగ్గా ఉన్నా, వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని" కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో పేర్కొన్నాడు.


