వైభవ్, ఇషాన్
నేడు ఎలిమినేటర్ మ్యాచ్
రాజస్తాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
న్యూ చండీగఢ్: ఐపీఎల్ గత సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి పదునైన ఆటతో మళ్లీ ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని, మరోసారి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ముందుగా ‘నాకౌట్’ మ్యాచ్కు జట్టు సిద్ధమైంది. నేడు జరిగే ‘ఎలిమినేటర్’ పోరులో మరో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్తో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు క్వాలిఫయర్–2కు అర్హత సాధించనుండగా... ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్కమిస్తుంది.
కమిన్స్ నాయకత్వంలోని సన్రైజర్స్లీగ్ దశలో 9 విజయాలతో మూడో స్థానంలో నిలవగా... రియన్ పరాగ్ కెప్టేన్సీలో 8 విజయాలు సాధించిన రాజస్తాన్ నాలుగో స్థానంతో ముగించింది. అయితే ఇరు జట్ల మధ్య తాజా సీజన్లో జరిగిన రెండు మ్యాచ్లలో గెలిచి హైదరాబాద్ 2–0తో పైచేయి సాధించింది. మానసికంగా ఇది రైజర్స్కు ఉత్సాహానిచ్చే అంశం. విధ్వంస బ్యాటింగ్ ప్రదర్శనకు చిరునామాగా నిలుస్తూ క్లాసెన్ (606 పరుగులు), ఇషాన్ కిషన్ (569), అభిషేక్ శర్మ (563), హెడ్ (393) సీజన్ను శాసించారు. ఈ టాప్–4 బ్యాటర్లను నిలువరించగలిగితేనే రాజస్తాన్కు మ్యాచ్లో కనీస అవకాశం ఉంటుంది.
చక్కటి బౌలింగ్తో మలింగ (19 వికెట్లు), సాకిబ్ (15) ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. మరోవైపు రాజస్తాన్ ప్రధానంగా వైభవ్ సూర్యవంశీ (583), యశస్వి జైస్వాల్ (397) ఇచ్చే ఆరంభంపై ఆధారపడుతోంది. ధ్రువ్ జురేల్ (458) కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో ఆర్చర్ (21) ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. బ్రిజేశ్ శర్మ (13), బర్గర్ (11) కూడా రాణించాల్సి ఉంది.


