IPL 2025: కెప్టెన్‌గా ధోనిని అధిగమించిన శ్రేయస్‌ అయ్యర్‌ | IPL 2025, PBKS VS LSG: Shreyas Iyer Now Has Best Win Percentage As Captain In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2025: కెప్టెన్‌గా ధోనిని అధిగమించిన శ్రేయస్‌ అయ్యర్‌

May 5 2025 2:01 PM | Updated on May 5 2025 3:56 PM

IPL 2025, PBKS VS LSG: Shreyas Iyer Now Has Best Win Percentage As Captain In IPL History

Photo Courtesy: BCCI

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సారధిగా వ్యవహరిస్తున్న అయ్యర్‌.. వివిధ జట్ల తరఫున (ఢిల్లీ, కేకేఆర్‌, పంజాబ్‌) 81 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 45 విజయాలు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో కనీసం 80 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో శ్రేయస్‌దే అత్యధిక విజయాల శాతం.

తాజాగా లక్నోపై విజయంతో (ధర్మశాల) ఐపీఎల్‌లో శ్రేయస్‌ విన్నింగ్‌ పర్సెంటేజీ 58.22కు చేరింది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ అయిన ధోనిని శ్రేయస్‌ విన్నింగ్‌ పర్సెంటేజీ అంశంలో అధిగమించాడు. 

ఐదు సార్లు సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలబెట్టిన ధోని ప్రస్తుత సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడటంతో సీఎస్‌కేకు స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని కేవలం ఒకే ఒకే మ్యాచ్‌లో (లక్నోపై) తన జట్టును విజయపథాన నడిపించాడు.

తాజా వైఫల్యాల తర్వాత కెప్టెన్‌గా ధోని ట్రాక్‌ రికార్డు అమాంతం పడిపోయింది. అతని విన్నింగ్‌ పర్సంటేజీ 58.82 నుంచి 57.75కి దిగజారింది. ఈ మధ్యలో వరుస విజయాలు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా ధోనిని అధిగమించారు.

ఈ సీజన్‌లోనే పంజాబ్‌ కెప్టెన్‌గా నియమితుడైన శ్రేయస్‌ తన జట్టుకు అపురూపమైన విజయాలు అందిస్తూ ప్లే ఆఫ్స్‌ దిశగా నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో శ్రేయస్‌ నేతృత్వంలో పంజాబ్‌ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో 15 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానాంలో కొనసాగుతుంది. 

2014 సీజన్‌ తర్వాత పంజాబ్‌ ఓ సీజన్‌లో 15 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. నిన్న మ్యాచ్‌ జరిగిన ధర్మశాలతో పంజాబ్‌ 12 ఏళ్ల తర్వాత గెలిచింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ శ్రేయస్‌ కెప్టెన్సీలో గతానికి భిన్నంగా సాగుతోంది. పంజాబ్‌ ఇదే జోరును కొనసాగిస్తే వారి టైటిల్‌ కల నెరవేరుతుంది. 

గత సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా, అంతకుముందు ఢిల్లీని రన్నరప్‌గా నిలబెట్టిన శ్రేయస్‌.. పంజాబ్‌ తలరాత మారుస్తాడేమో చూడాలి.

ప్రస్తుత ఐపీఎల్‌ కెప్టెన్ల విజయాల శాతం..
శ్రేయస్‌ అయ్యర్‌- 58.22 (81 మ్యాచ్‌లు)
ధోని- 57.75 (232 మ్యాచ్‌లు)
హార్దిక్‌ పాండ్యా- 60.00 (55 మ్యాచ్‌లు)
రిషబ్‌ పంత్‌- 52.77 (54 మ్యాచ్‌లు)
రహానే- 40.00 (36 మ్యాచ్‌లు)
కమిన్స్‌- 46.15 (26 మ్యాచ్‌లు)
శుభ్‌మన్‌ గిల్‌- 54.54 (22 మ్యాచ్‌లు)
అక్షర్‌ పటేల్‌- 50.00 (11 మ్యాచ​్‌లు)
రజత్‌ పాటిదార్‌- 72.72 (11 మ్యాచ్‌లు)
రియాన్‌ పరాగ్‌- 25.00 (8 మ్యాచ్‌లు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement