తొలి విజయం వేటలో భారత్
నేడు ఇంగ్లండ్తో నాలుగో టి20 మ్యాచ్
బ్రిస్టల్: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టి20 మ్యాచ్లు ముగిశాయి. నాలుగు మ్యాచ్లలో ఓటమి దక్కగా, ఒక దాంట్లో ఫలితం రాలేదు. టీమ్తో పాటు కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ కూడా తన సారథ్యంలో తొలి గెలుపు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. 2018–19లో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో టి20 సిరీస్లు కోల్పోయిన తర్వాత భారత్ మళ్లీ వరుసగా రెండు సిరీస్లు చేజార్చుకోలేదు. అయితే ఇప్పుడు అలాంటి ప్రమాదం జట్టుకు పొంచి ఉంది. ఇలాంటి స్థితిలో నేడు ఇంగ్లండ్తో నాలుగో టి20 మ్యాచ్లో భారత్ తలపడనుంది. ఇక్కడ ఓడితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ చేజారుతుంది. టీమిండియా తమ స్థాయికి తగినట్లు సత్తా చాటి మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే సిరీస్ సమంగా ముగుస్తుంది.
వైభవ్ చెలరేగుతాడా...
గత మ్యాచ్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో చిత్తుగా ఓడింది. అలాంటి భారీ పరాజయం నుంచి కోలుకొని జట్టు ఎలాంటి జవాబు ఇస్తుందనేది ఆసక్తికరం. మూడో టి20లో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. అభిషేక్, ఇషాన్ నుంచి జట్టు మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. వైభవ్ సూర్యవంశీని అప్పుడే విమర్శించడం సరైంది కాదు అలా రెండు సిక్స్లు కొట్టి నిష్క్రమించే ఆట మాత్రం సరి కాదు. కుదురుకుంటే అతడిని ఆపడం ఇంగ్లండ్కు కష్టం కావచ్చు. వైస్ కెప్టెన్ తిలక్వర్మ వరుసగా చెత్త షాట్లతో విఫలం కావడం కలవరపరుస్తున్న అంశం కాగా, శివమ్ దూబే మరింత దూకుడుగా ఆడాల్సి ఉంది. అన్నింటికి మించి శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్ను మెరుగుపర్చుకోకపోతే కెప్టెన్గా తొలి పర్యటన అతనికి ఎప్పటికీ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
మార్పుల్లేకుండా...
ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ సిరీస్ కోసం టీమ్తో పాటు ఉన్న ఇద్దరు ఆటగాళ్లు జేమ్స్ కోల్స్, రేహన్ అహ్మద్లను దేశవాళీ మ్యాచ్ల కోసం వెనక్కి పంపించింది. కాబట్టి గత మ్యాచ్లో ఘన విజయం అందించిన తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఇంగ్లండ్ బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. బౌలింగ్లో ఆర్చర్, టంగ్ పదునైన బౌలింగ్ భారత్ను ఇబ్బంది పెట్టవచ్చు. బ్రిస్టల్ కౌంటీ మైదానం బ్యాటింగ్కు బాగా అనుకూలం. రెండు వైపులా చిన్న బౌండరీలు కూడా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షసూచన లేదు.


