మూడో వన్డే : కష్టాల్లో ఆసీస్‌.. స్కోరెంతంటే

India vs Australia 3rd One Day Updates Today - Sakshi

కాన్‌బెర్రా: మ్యాక్స్‌వెల్‌ అవుట్‌తో ఆసీస్‌కు షాక్‌ తగిలింది.  అర్థసెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ 59 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ఆసీస్‌ 268 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. ఆసీస్‌ గెలవాలంటే 25 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది.‌  

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ 6వ వికెట్‌ను కోల్పోయింది. 210 పరుగుల వద్ద 38 పరుగులు చేసిన అలెక్స్‌ క్యారీ రనౌట్‌గా వెనుదిరగాడు. అయితే క్రీజులో ఉన్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌ దాటిగా ఆడుతుండడంతో ఆసీస్ ఇంకా గెలుపుపై ధీమాగానే ఉంది. ఆసీస్‌ మ్యాచ్‌ గెలవాలంటే 60 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 36 పరుగులతో, అగర్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకముందు 158 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కామెరాన్‌ గ్రీన్‌ కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 32 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అలెక్స్‌ క్యారీ 19, మ్యాక్స్‌వెల్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో 302 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇప్పటివరకు 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ 14, అలెక్స్‌ క్యారీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జట్టు స్కోరు 117 పరుగుల వద్ద ఉన్నప్పుడు 22 పరుగులు చేసిన హెన్రిక్స్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో వెనుదిరగాడు. ఆ తర్వాత కాసేపటికే 75 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ ఫించ్‌ జడేజా బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 


టీమిండియా విధించిన 303 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ నిలకడగా చేధిస్తోంది. ఇప్పటివరకు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ 59 పరుగులతో, హెన్రిక్స్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన స్టీవ్‌ స్మిత్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో 7 పరుగులకే అవుట్‌ కావడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న టి. నటరాజన్‌  ఓపెనర్‌ మార్నస్‌ లబుషేన్ను 7 పరగుల వద్ద ఔట్‌ చేసి టీమిండియాకు తొలి వికెట్‌ అందించాడు. 

అదరగొట్టిన పాండ్యా, జడేజా.. 300 దాటిన స్కోరు!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, జడేజా మెరుగైన ప్రదర్శన కనబరిచారు. కెప్టెన్‌ కోహ్లి అవుట్‌ కావడంతో కష్టాల్లో మునిగిపోయిన జట్టును గట్టెక్కించే బాధ్యతను తలకెత్తుకున్న ఈ ఆల్‌రౌండర్లు.. చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరు కలిసి 108 బంతుల్లో 159 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ముఖ్యంగా 47వ ఓవర్‌లో జడేజా ఆసీస్‌ బౌలర్‌ అబాట్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 43 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఎదుర్కొన్న జడ్డూభాయ్‌ 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఇక 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్స్‌తో పాండ్యా 92 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్‌లో పాండ్యాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక కోహ్లి, జడేజా, పాండ్యా అర్ధసెంచరీలు నమోదు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది.(చదవండి: ‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’)

కష్టాల్లో టీమిండియా
టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. నిలకడగా ఆడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అవుట్‌ అయ్యాడు. 152 పరగుల వద్ద హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్ క్యారీకి క్యాచ్‌కి ఇచ్చి కోహ్లి(63) పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇక ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా‌, రవీంద్ర జడేజా‌ క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఆసీస్‌ బౌలర్లు అబాట్‌, జంపా, హాజిల్‌వుడ్‌ చెరో వికెట్‌ తీసుకోగా.. శుభ్‌మన్‌, కేఎల్‌ రాహుల్‌ను పెవిలియన్‌కు చేర్చిన అగర్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా అంతకు ముందు అగర్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 11 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు.

అంతకు ముందు ఆడం జంపా బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఔట్‌ అయ్యాడు. లబుషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇప్పటివరకు ఆసీస్‌ బౌలర్లు అబాట్‌, జంపా చెరో వికెట్‌ తీసుకోగా.. శుభ్‌మన్‌, కేఎల్‌ రాహుల్‌ను పెవిలియన్‌కు చేర్చిన అగర్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 27వ ఓవర్‌ ముగిసే సరికి కోహ్లి హాఫ్‌ సెంచరీ(64 బంతులు‌) పూర్తి చేసుకున్నాడు. కాగా  30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.

శుభ్‌మన్‌ ఔట్‌!
అగర్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మయాంక్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్‌ 39 బంతుల్లో 33 పరుగులు‌ చేశాడు.‌ 122/3 (25) కాగా 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.

20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 104/2
శుభ్‌మన్‌ గిల్‌ కంటే ముందు అబాట్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఔటయ్యాడు. అగర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శుభ్‌మన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్‌ కోల్పోయి 81 పరుగులు చేసింది. కాగా తొలుత టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కోహ్లి సేన ఇప్పటికే 2-0తో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి వన్డేలో ఎలాగైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.


ఈ నేపథ్యంలో పలు మార్పులతో మైదానంలో దిగుతోంది. మయాంక్ అగర్వాల్‌, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, చహల్‌ స్థానాల్లో శుభ్‌మన్ గిల్‌, నటరాజన్‌, శార్దుల్, కుల్దీప్‌ యాదవ్‌ల‌కు చోటు కల్పించింది. కాగా మనుకా ఓవల్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి.. భారీ స్కోర్లు నమోదుకావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం. దీంతో కోహ్లి బ్యాటింగ్‌కే మొగ్గుచూపడం సానుకూలాంశంగా పరిణమించింది.(చదవండి: ఆ రికార్డుకు 23 పరుగుల దూరంలో కోహ్లి)

తుది జట్లు
టీమిండియా: శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, నటరాజన్‌

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, అలెక్స్‌ క్యారీ(వికెట్‌ కీపర్‌), కామరూన్‌ గ్రీన్‌, ఆష్టన్‌ అగర్‌, సీన్‌ అబాట్‌, ఆడం జంపా, హేజల్‌వుడ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top