
దేశంలో నానాటికీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు
2023 పరీక్షల్లో పట్టుబడిన 214 మంది అథ్లెట్లు
న్యూఢిల్లీ: క్రీడల నుంచి డోపింగ్ను రూపుమాపాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) పరీక్షల ఫలితాల్లో భారత్ ప్రమాదకర స్థాయిలో నిలుస్తోంది. 2023 సంవత్సరానికి గానూ ‘వాడా’ నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో భారత్ 3.8 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 5,606 నమూనాలు సేకరించగా... అందులో 3.8 శాతం అంటే 214 మంది అథ్లెట్లు నిషేధిత ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అంతకముందు సంవత్సరంలో 3,865 నమూనాల్లో భారత డోపింగ్ రేటు 3.2గా ఉంది.
5,606 నమూనాల్లో 2,748 నమూనాలు పోటీలు జరుగుతున్న సమయంలో తీసుకున్నవి కావడం గమనార్హం. నిషేధిత ఉ్రత్పేరకాలు వాడిన జాబితాలో చైనా (28,197 నమూనాల్లో 0.2శాతం), అమెరికా (6798 నమూనాల్లో 1.0 శాతం), ఫ్రాన్స్ (11,368 నమూనాల్లో 0.9 శాతం), జర్మనీ (15,153 నమూనాల్లో 0.4 శాతం), రష్యా (10,395 నమూనాల్లో 1.0 శాతం) మెరుగ్గా ఉండగా... భారత్ ప్రమాదకర స్థాయిలో ఉంది. సేకరించిన నమూనాల్లో భారత్ నుంచి 214 మంది పాజిటివ్గా తేలగా... ఫ్రాన్స్ నుంచి 105 మంది, రష్యా నుంచి 99 మంది, అమెరికా నుంచి 66 మంది, చైనా నుంచి 60 మంది, జర్మనీ నుంచి 57 మంది అథ్లెట్లు డోపింగ్లో దొరికారు.