Ind vs WI: 'Bhatta Phenk Raha Hai' - Did Kohli Accuse Windies Star Of Illegal Bowling Action? - Sakshi
Sakshi News home page

#Virat Kohli: ఏంటా బౌలింగ్‌? అదే పనిగా..! సీరియస్‌ అయిన కోహ్లి! వైరల్‌

Jul 14 2023 5:02 PM | Updated on Jul 14 2023 5:38 PM

Ind vs WI Bhatta Phenk Raha Hai Did Kohli Accuse Windies Star Illegal Bowling Action - Sakshi

West Indies vs India, 1st Test: టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి వెస్టిండీస్‌తో టెస్టులో నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. రన్‌మెషీన్‌ శైలికి భిన్నంగా తొలి బౌండరీ బాదేందుకు 81 బంతులు అవసరమయ్యాయి. మొదటి 80 బంతుల్లో కేవలం సింగిల్స్‌, డబుల్స్‌తోనే నెట్టుకొచ్చిన కోహ్లి.. ఎట్టకేలకు విండీస్‌ స్పిన్నర్‌ వారికన్‌ బౌలింగ్‌(108.4వ ఓవర్లో)లో కవర్‌ డ్రైవ్‌ దిశగా ఆడి బౌండరీ సాధించాడు.

ఏంటా బౌలింగ్‌?
ఇదిలా ఉంటే.. కోహ్లి.. విండీస్‌ కెప్టెన్‌ క్రెగ్‌ బ్రాత్‌వైట్‌పై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. 79వ ఓవర్‌ సందర్భంగా పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌ శైలిపై అనుమానం వ్యక్తం చేస్తూ సహచర ఆటగాడు యశస్వి జైశ్వాల్‌తో కోహ్లి మాట్లాడిన మాటలు స్టంప్‌ మైకులో రికార్డు అయినట్లు క్రికెట్‌ సైట్‌ విజ్డన్‌ వెల్లడించింది.

గతంలో కూడా అనుమానాలు
ఇందులో కోహ్లి.. ‘Bhatta Phenk Raha Hai’(ఇటుకలు విసిరినట్లు బంతి విసురుతున్నాడన్న ఉద్దేశంలో) అన్నట్లు తెలుస్తోంది. బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌ యాక్షన్‌ గురించి కోహ్లి ఈ మేరకు యశస్వితో అన్నాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా రైట్‌ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ అయిన క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై గతంలో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి.

2019లో టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌ సందర్భంగా.. అతడి యాక్షన్‌పై భారత బ్యాటర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్‌ చేస్తున్నాడంటూ 2017లోనూ అతడిపై ఫిర్యాదు రాగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మాత్రం క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

ఆధిక్యంలో టీమిండియా
తాజాగా మరోసారి కోహ్లి వ్యాఖ్యలతో బ్రాత్‌వైట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. కాగా బంతిని రిలీజ్‌ చేసే సమయంలో బౌలర్‌ అరచేయి హారిజెంటల్‌ అయ్యే క్రమంలో మోచేయిని 15 డిగ్రీలకు మించి వంచకూడదు/చాచకూడదు. లేదంటే దానిని నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్‌ చేసినట్లు భావిస్తారు.

ఇదిలా ఉంటే.. విండీస్‌తో డొమినికా టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి కోహ్లి మొత్తంగా 96 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి 143 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఓపెనర్ల సెంచరీలతో రెండో రోజు టీమిండియాకు 162 పరుగుల ఆధిక్యం లభించింది.

చదవండి: విండీస్‌ ఆటగాడిపై జైశ్వాల్‌ దూషణల పర్వం; కోహ్లి సీరియస్‌ 
Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement