గౌతమ్‌ గంభీర్‌పై విమర్శల వర్షం | IND VS ENG 1st Test: Team India Lost 9 In 11 Matches In Gautam Gambhir Era | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ గంభీర్‌పై విమర్శల వర్షం

Jun 25 2025 9:11 PM | Updated on Jun 25 2025 9:15 PM

IND VS ENG 1st Test: Team India Lost 9 In 11 Matches In Gautam Gambhir Era

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత (2024, జూన్‌) బాధ్యతలు చేపట్టాడు. రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి గంభీర్‌ బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్‌ ఆథ్వర్యంలో భారత్‌ టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ద్రవిడ్‌ వారసుడిగా అప్పటికే కేకేఆర్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ (మెంటార్‌) అందించిన గంభీర్‌ రావడంతో టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగాయి. మూడు ఫార్మాట్లలో భారత్‌కు తిరుగుండదని అందరూ భావించారు.

అయితే అంచనాలు తారుమారయ్యాయి. గంభీర్‌ ఆథ్వర్యంలో టీమిండియా టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ రెండు వరుస విజయాలతో  తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తొలి రెండు విజయాలు బంగ్లాదేశ్‌పై సాధించినవి కావడంతో వాటికి అంత ప్రాముఖ్యత దక్కలేదు.

అయితే గంభీర్‌కు అసలు పరీక్ష మూడో టెస్ట్‌ నుంచి మొదలైంది. భారత్‌ స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడింది. ఇక్కడి నుంచే గంభీర్‌పై విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించడంతో గంభీర్‌ విజయ ప్రస్తానం మొదలైందని అంతా అనుకున్నారు. 

అయితే గంభీర్‌ విజయ పరంపర కేవలం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మూడో టెస్ట్‌ డ్రా కాగా.. నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా వరుసగా పరాజయాలు చవిచూసింది.

తాజాగా ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో భారత్‌ గంభీర్‌ ఆథ్వర్యంలో హ్యాట్రిక్‌ పరాజయాలను మూటగట్టుకుంది. గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉండగా.. భారత్‌ 11 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో కేవలం​ మూడే విజయాలు సాధించింది. ఒకటి డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట పరాజయాలు ఎదుర్కొంది. 

వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్‌పై విమర్శలు ధాటి బాగా పెరిగింది. ద్రవిడ్‌ హయాంలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా.. గంభీర్‌ వచ్చాక అదఃపాతాళానికి పడిపోయిందని భారత క్రికెట్‌ అభిమానులే అంటున్నారు. గంభీర్‌ వచ్చాక  టీమిండియాలో రాజకీయాలు ఎక్కువయ్యాయని, అందుకే ఈ పరాజయాలు పరంపర అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

గంభీర్‌ తన తీరును మార్చుకోకపోతే టీమిండియా ఇంగ్లండ్‌లో వైట్‌వాష్‌ తప్పదని జోస్యం చెబుతున్నారు. గంభీర్‌ రాజకీయాలు మాని జట్టును గెలుపు బాట పట్టించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. గంభీర్‌ ఇదే ధోరణిని కొనసాగిస్తే.. భారత్‌కు టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద పరాజయాలు పరంపర తప్పదని హెచ్చరిస్తున్నారు. 

1967-68లో భారత్‌ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొన్న భారత్‌.. ఇంగ్లండ్‌ చేతిలో వైట్‌ వాష్‌ అయితే ఆ రికార్డును సమం చేస్తుంది. ప్రస్తుతం టీమిండియా గంభీర్‌ ఆథ్వర్యంలో గత 9 మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించి, మరో అపవాదును మూటగట్టుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement