
భారత టెస్టు జట్టు సభ్యులైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వివిధ వయో విభాగాల్లో ఈ కర్ణాటక మిత్రులు కలిసి ఆడారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రాహుల్, నాయర్లకు ఒకే టెస్టులో కలిసి ఆడే అవకాశం దక్కింది. టీమ్లో రాహుల్ రెగ్యులర్ మెంబర్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత నాయర్ పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ స్నేహం చిరకాలం కొనసాగడంతో పాటు టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పాడు.
‘11 ఏళ్ల వయసులో ఇద్దరం ఒకేసారి క్రికెట్ ఆడటం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఇప్పటికీ సాగుతోంది. ఇద్దరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గత 2–3 ఏళ్లలో అద్భుతంగా ఆడి ఎన్నో ప్రతికూలతలను దాటి నాయర్ పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్లో ఉండే పరిస్థితులు, సవాళ్ల గురించి మేము మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిసి భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్, కరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో ఆడటం దాదాపుగా ఖరారైంది. ఈ మ్యాచ్లో రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉండగా.. కరుణ్ మిడిలార్డర్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు రావచ్చు.
విరాట్, రోహిత్ల టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ విభాగంలో రాహులే సీనియర్ సభ్యుడు. పైగా రాహుల్కు గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓపెనర్గానే గత పర్యటనలో రాహుల్ సెంచరీ చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్ పలు బ్యాటింగ్ స్థానాలు మారినా ఓపెనర్గా అయితే అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పర్వాలేదనిపించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇరగదీశాడు.

కరుణ్ విషయానికొస్తే.. గత రెండు దేశవాలీ సీజన్లలో పరుగుల వరద పారించిన ఇతగాడు.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి మాంచి జోష్లో ఉన్నాడు. కరుణ్కు ఇంగ్లండ్ గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. కౌంట్లీలో అతని పేరిట ఓ డబుల్ సెంచరీ, పలు సెంచరీలు ఉన్నాయి.
కరుణ్ తనకు గుర్తింపు తెచ్చిన ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్పైనే సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై, ఇంగ్లండ్పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటంతో కరుణ్పై ఈ సిరీస్లో భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ్ను భారత క్రికెట్ అభిమానులు విరాట్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దోస్తులు (రాహుల్, కరుణ్) నేటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్లో ఏమేరకు రాణిస్తారో చూడాలి.