బంగ్లాదేశ్లో ఇటీవలే ఎన్నికైన కొత్త క్రికెట్ బోర్డు తమ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్తో అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విచారణ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జాతీయ క్రీడా మండలి (ఎన్ఎస్సీ) ఐసీసీని ఆశ్రయిస్తూ గెజిట్ను విడుదల చేయడం తమను ఆశ్చర్యపరిచిందని బీసీబీ పేర్కొంది.
ఈ గెజిట్ ఎన్నికైన పరిపాలన స్థిరత్వం, స్వాతంత్ర్యం, కొనసాగింపు విషయంలో అనిశ్చితి సృష్టించే అవకాశముందని తెలిపింది. ఇదే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అష్రఫుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీసీబీ దేశ క్రీడామండలి పరిధిలో ఉందని, ఏమైనా అభ్యంతరాలుంటే బీసీబీకి చెప్పుకోవచ్చు.
కానీ ప్రస్తుత బోర్డు మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా అనిపించింది. బంగ్లా క్రికెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఐసీసీ మా యాజమాని కాదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో మాకు సభ్యత్వమున్నప్పటికీ తొలి ప్రాధాన్యత మాత్రం నేషనల్ స్పోర్ట్స్ పాలసీ (ఎన్ఎస్సీ)దే. బీసీబీ రాజ్యాంగం మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉంది.
అయితే ఐసీసీ మాకు సహాయకులు, మంచి మిత్రులు’ అని చెప్పుకొచ్చాడు. అంతకముందు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల కారణంగా కేకేఆర్ ముస్తాఫిజుర్ను జట్టు నుంచి రిలీజ్ చేయడం కూడా బంగ్లా క్రికెట్ బోర్డుకు రుచించలేదు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ సమయంలో భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, వేదికలు మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. దీంతో బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.


