సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 11) జరుగుతున్న మ్యాచ్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తన ఐపీఎల్ కెరీర్లో 16 బంతుల్లో ఓసారి.. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు.
ఈ విభాగంలో అభిషేక్ తర్వాతి స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. పూరన్ 4 సార్లు ఐపీఎల్లో 20 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. అభిషేక్, పూరన్ తర్వాతి స్థానాల్లో జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (3), వైభవ్ సూర్యవంశీ (3) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.
మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు.


