హార్దిక్‌ పాండ్యా వీరబాదుడు

Hardik's Fifty Helps Mumbai Indians To 195 - Sakshi

అబుదాబి: రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ క్వింటాన్‌ డీకాక్‌(6) విఫలమయ్యాడు.  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో డీకాక్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఆకట్టుకున్నారు. ఈ జోడి 83 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత ఇషాన్‌ కిషన్‌(37; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కార్తీక్‌ త్యాగి వేసిన 11 ఓవర్‌ నాల్గో బంతికి ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి  ఇసన్‌ ఔటయ్యాడు.

దాంతో 90 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌గా కోల్పోగా, మరో ఐదు పరుగుల  వ్యవధిలో సూర్యకుమార్‌(40; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 13 ఓవర్‌ రెండో బంతికి షాట్‌ ఆడిన సూర్యకుమార్‌.. స్టోక్స్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. పొలార్డ్‌(6) నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో సౌరవ్‌ తివారీ(34; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా(60 నాటౌట్‌; 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో  ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.

చివరి ఐదు ఓవర్లలో.. 79 పరుగులు
ఈ మ్యాచ్‌లో 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. దాంతో రాజస్తాన్‌ కట్టుదిట్టంగానే బౌలింగ్‌ చేసినట్లు కనబడింది. కాగా, హార్దిక్‌ పాండ్యా, సౌరవ్‌ తివారీలతో చెలరేగి ఆడారు. కార్తీక్‌ త్యాగి వేసిన 16 ఓవర్‌లో ఐదు పరుగులే వచ్చినా, ఆ తర్వాత అసలు మజా మొదలైంది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 17 ఓవర్‌లో తివారీ రెండు ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు.

దాంతో ఆ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఇక రాజ్‌పుత్‌ వేసిన 18 ఓవర్‌లో హార్దిక్‌ చెలరేగిపోయాడు. తొలి బంతికి సిక్స్‌ కొట్టిన హార్దిక్‌.. నాలుగు,  ఐదు, ఆరు బంతుల్ని సిక్స్‌లు కొట్టాడు. హార్దిక్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు సాధించడంతో ఆ ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి. ఇక ఆర్చర్‌ వేసిన 19 ఓవర్‌ తొలి బంతికి సౌరవ్‌ తివారీ ఔట్‌ కావడంతో మూడు పరుగులే వచ్చాయి. త్యాగి వేసిన చివరి ఓవర్‌లో హార్దిక్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టడంతో ముంబై ఇండియన్స్‌ 27 పరుగులు పిండుకుంది. చివరి ఐదు ఓవర్లలో ముంబై వికెట్‌ మాత్రమే కోల్పోయి 79 పరుగులు సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top