కేఎల్‌ రాహుల్‌, హార్ధిక్‌ పాండ్యాలను నిర్దోషులుగా తేల్చిన కోర్టు

Hardik Pandya, KL Rahul Found Innocent By Court Over Comments Against Women On KWK - Sakshi

'కాఫీ విత్‌ కరణ్‌' షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, హార్ధిక్‌ పాండ్యాలకు ఊరట లభించింది. వీరితో పాటు షో హోస్ట్‌, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌కు కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేలుస్తూ జోధ్‌పూర్‌ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. 2018లో కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 6 సందర్భంగా షో హోస్ట్‌ కరణ్‌ జోహర్‌ అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు (సెక్స్‌ లైఫ్‌) రాహుల్‌, పాండ్యాలు వ్యంగ్యమైన సమాధానాలు చెప్పారు.

ఇందుకు గాను వీరు తగిన మూల్యమే చెల్లించుకున్నారు. అప్పట్లో వీరిద్దరు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. బీసీసీఐ ఈ ఇద్దరిని అర్ధంతరంగా ఆసీస్‌ పర్యటన నుంచి వెనక్కు పంపించేసింది. అంతటితోనే ఆగకుండా వీరిద్దరిపై సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది. ఈ విషయమై డాక్టర్‌ మేఘ్‌వాల్‌.. రాహుల్‌, హార్థిక్‌ సహా కరణ్‌ జోహర్‌లపై జోధ్‌పూర్‌లోని లునీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఆ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కోర్టు ఈ కేసును కొట్టేసింది. కాగా, ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌, హార్ధిక్‌ పాండ్యాలు టీమిండియాలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పాండ్యా ప్రస్తుతం విండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియాలో భాగంగా ఉంటే, ఇటీవలే గాయం నుంచి కోలుకుని రాహుల్‌ ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాడు. 
చదవండి: IND vs WI: విండీస్‌తో మూడో టీ20.. శ్రేయస్‌ అవుట్‌! హుడాకు ఛాన్స్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top