వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్... మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న ఇంగ్లండ్... శనివారం కివీస్తో జరిగిన ఆఖరి పోరులో 2 వికెట్ల తేడాతో ఓడింది. ఫలితంగా సొంతగడ్డపై టి20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్... వన్డే సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్... 40.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ (62 బంతుల్లో 68; 10 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా... జోస్ బట్లర్ (56 బంతుల్లో 38; 7 ఫోర్లు), బ్రైడన్ కార్స్ (30 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు.
బౌలర్లలో బ్లెయిర్ టిక్నెర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (46; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (44; 4 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. టిక్నెర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, డారిల్ మిచెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.


