చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. టీమిండియాకు భంగపాటు | ENG beat IND by 26 runs in 2nd T20I | Sakshi
Sakshi News home page

చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. టీమిండియాకు భంగపాటు

May 31 2026 9:03 AM | Updated on May 31 2026 9:03 AM

ENG beat IND by 26 runs in 2nd T20I

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్‌ వేదికగా నిన్న (మే 30) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు 26 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఫ్రేయా కెంప్‌ (39 నాటౌట్‌), డ్యానీ వాట్‌ హాడ్జ్‌ (29), అమీ జోన్స్‌ (28), అలైస్‌ క్యాప్సీ (28), డానియెలా గిబ్సన్‌ (11 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. సోఫీ డంక్లీ (10), హీథర్‌ నైట్‌ (18) తక్కువ స్కోర్లతో ఔటయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి (4-025-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. శ్రేయాంక పాటిల్‌ (4-0-29-1), నందిని శర్మ (4-0-26-1) కూడా పర్వాలేదనిపించారు.

అనంతరం​ ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఇంగ్లండ్‌ బౌలర్లు తలో చేయి వేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. లారెన్‌ బెల్‌, ఛార్లోట్‌ డీన్‌, ఫ్రేయా కెంప్‌ తలో 2 వికెట్లు, సోఫీ ఎక్లెస్టోన్‌ ఓ వికెట్‌ తీసి టీమిండియాను దెబ్బకొట్టారు. 

భారత ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసిన యస్తికా భాటియా టాప్‌ స్కోరర్‌ కాగా.. స్మృతి మంధన 32, కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 28, షఫాలీ వర్మ 22 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్‌ 1, రిచా ఘోష్‌ 8, దీప్తి శర్మ 2, శ్రేయాంక 6, శ్రీచరణి 1, అరుంధతి రెడ్డి 4 (నాటౌట్‌), నందిని శర్మ 0 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సిరీస్‌లో బోణీ కొట్టింది. టాంటన్‌ వేదికగా జూన్‌ 2న జరిగే మూడో టీ20తో సిరీస్‌ డిసైడ్‌ అవుతుంది. తొలి టీ20లో భారత్‌ 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడో టీ20 తర్వాత ఇరు జట్ల మధ్య జూన్‌ 10 నుంచి ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement