చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. 2026 ఎడిషన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆ జట్టు.. 36వ సారి 200 ప్లస్ మార్కును తాకింది. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు సీఎస్కే, ఆర్సీబీ (35) పేరిట సంయుక్తంగా ఉండేది.
ఈ విభాగంలో సీఎస్కే, ఆర్సీబీ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (32), ముంబై ఇండియన్స్ (31), కేకేఆర్ (29) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. 2024 ఎడిషన్లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఆయుశ్ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించాడు. సంజూ శాంసన్ (7), కార్తీక్ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చహల్, జన్సెన్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు.
అనంతరం 210 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సైతం ధాటిగా ఆడుతుంది. 8 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. ప్రభ్సిమ్రన్ (38), కూపర్ కన్నోల్లీ (7) క్రీజ్లో ఉన్నారు. ప్రియాంశ్ ఆర్యను మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు.


