ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్ గ్రీన్ ఒకడు. రూ. 25.20 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ వాళ్లకే జాక్పాట్లు తగులుతున్నాయి.
అయితే గ్రీన్ అంత హార్డ్ హిట్టర్ బ్యాటర్ కూడా కాదు. వన్డే ఫార్మాట్లో మంచి బ్యాటర్ అయిన కామెరున్ గ్రీన్ టీ20ల్లో స్ట్రైక్రేటు కూడా సాధారణంగానే ఉంటుంది. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోని గ్రీన్ తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ ఆకట్టుకోలేదు. దీనికి తోడు అతడిని దురదృష్టం వెంటాడింది.
మలింగ ఓవర్లో రఘువంశీ నేరుగా షాట్ కొట్టగా బంతి బౌలర్ కాలికి తగిలి కొద్ది దూరం వెళ్లింది. ఇదే అదనుగా రఘువంశీ, గ్రీన్ కాస్త సంకోచిస్తూనే పరుగు ప్రారంభించారు. అయితే వెంటనే తేరుకున్న మలింగ బంతిని అందుకొని నాన్స్ట్రయికర్ ఎండ్ వైపు స్టంప్స్ను పడగొట్టాడు. దాంతో రఘువంశీ తాను రనౌట్ అయినట్లుగా భావించి తిరుగుముఖం పట్టాడు.
కానీ బౌండరీ లైన్ వద్ద అతడిని ఆపిన అంపైర్లు రీప్లేను పరిశీలించారు. పరుగు తీసే క్రమంలో ఇద్దరూ బ్యాటర్లు దాదాపు ఒకే లైన్లో ఉన్నారు. గ్రీన్ ఇంకా రఘువంశీని దాటలేదు. దాంతో నిబంధన ప్రకారం గ్రీన్ను అవుట్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రీన్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్కు గురయ్యాడు. ‘రనౌట్ అయి బతికిపోయాడు.. లేదంటే మరోసారి విమర్శలకు గురయ్యేవాడే’..‘ 25 కోట్లు దండగ అని మరోసారి నిరూపించాడు’ అని కామెంట్లు చేశారు.
A confusion between Raghuvanshi and Green. pic.twitter.com/wljEeRqlHF
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2026


