స్వదేశంలో జరుగుతున్న మహిళల టీ20 ట్రై-సిరీస్లో స్కాట్లాండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. టోర్నీ ఓపెనర్లో నెదర్లాండ్స్ను చిత్తు చేసిన ఈ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్కు భారీ షాకిచ్చింది.
ఎడిన్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా.. స్కాట్లాండ్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
బౌలర్లు, బ్రైస్ సిస్టర్స్ స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బౌలింగ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాబ్రియెల్లా ఫోంటెనియా (4-1-11-1), క్రిస్టీ గోర్డాన్ (4-0-21-1), క్యాథరీన్ బ్రైస్ (3-0-24-1), అబ్తహా మక్సూద్ (2-0-14-1) రాణించగా.. ఛేదనలో క్యాథరీన్ బ్రైస్ (54 నాటౌట్), సారా బ్రైస్ (23 నాటౌట్) సత్తా చాటారు. డార్సీ కార్టర్ (23), క్యాథరీన్ ఫ్రేసర్ (28) కూడా తలో చేయి వేశారు.
బంగ్లా బౌలర్లలో రీతూ మోనీ, షోర్నా అక్తెర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్లో కెప్టెన్ నిగార్ సుల్తానా (46 నాటౌట్) రాణించగా.. శోభన మోస్తరి (22), షోర్నా అక్తెర్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ప్లేయర్లలో దిల్హర అక్తెర్ 11, ఫిర్దోస్ 12, షర్మిన్ అక్తెర్ 10, రబేయా ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇవాళ (మే 31) జరుగబోయే తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ నెదర్లాండ్స్తో తలపడనుంది.


