ఐపీఎల్-2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. టీ20ల్లో టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్ ఉన్న అర్ష్దీప్.. గుజరాత్తో మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
తన 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు సమర్పించుకుని వికెట్ లెస్గా వెనుదిరిగాడు. అతడి ఎకానమీ రేటు 10.50గా ఉంది. వైశాఖ్ విజయ్కుమార్ వంటి యువ బౌలర్ మూడు వికెట్లు పడగొట్టి తన సత్తాచాటితే, అర్ష్దీప్ వంటి స్టార్ పేసర్ తేలిపోవడం పంజాబ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది.
కాగా గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసే బాధ్యతను అర్ష్దీప్ సింగ్కు కెప్టెన్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్ను పూర్తి చేసేందుకు అర్ష్దీప్ ఏకంగా 11 బంతులు వేయాల్సి వచ్చింది. ఇందులో 5 వైడ్లు, 1 నో-బాల్ ఉన్నాయి. ఈ పంజాబీ స్పీడ్ స్టార్ తన చెత్త బౌలింగ్తో అందరిని విసిగించాడు. ఈ క్రమంలో అర్ష్దీప్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్గా మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యాల సరసన అర్ష్దీప్ చేరాడు. వీరంతా అర్ష్దీప్ కంటే ముందు 11 బంతుల ఓవర్లు వేశారు. కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి చేధించింది. కూపర్ కొన్నోలీ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ?


