ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. తనదైన శైలిలో ఆర్సీబీ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు.
తన ఓపెనింగ్ పార్టనర్ ట్రావిస్ హెడ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో రెండు సీజన్లలో 40కు పైగా సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్గా అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ అందుకున్న రెండో ప్లేయర్గా అభిషేక్ నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఒకటి కంటే ఎక్కువ ఐపీఎల్ సీజన్లలో (3 సార్లు) 40+ సిక్సర్లు కొట్టాడు.
భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ మాత్రం అభిషేక్ శర్మనే కావడం గమనార్హం. ఒకే ఐపీఎల్ సీజన్లో 40 సిక్సర్ల మార్కును ఒకసారి దాటడమే కష్టమైన తరుణంలో, అభిషేక్ ఏకంగా రెండు సార్లు ఈ ఘనత సాధించి తన నిలకడను చాటుకున్నాడు. అభిషేక్ శర్మ 2024 ఐపీఎల్ సీజన్లో 42 సిక్సర్లు బాదగా.. ప్రస్తుత సీజన్లోనూ 40 సిక్సర్ల మార్క్ను దాటేశాడు.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్


