తొగుట(దుబ్బాక): ఆరుగాలం కష్టపడి పండించిన పొద్దు తిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ తొగుట మండల కేంద్రంలో మంగళవారం రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దున్నపోతుతో ర్యాలీ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దున్నపోతును కార్యాలయంలోకి తీసుకెళ్లి అధికారుల ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి 40 రోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి తదితరులు సంఘీభావం తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.


