గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని కొత్త కాలనీలకు ఇంకా ‘మిషన్ భగీరథ’ నల్లా నీరు అందడం లేదు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఇక్కడే ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభించిన సంగతి తెల్సిందే. మున్సిపాలిటీలో ‘మిషన్ భగరీథ’ ద్వారా నిత్యం 39లక్ష లీటర్ల మంచినీటి సరఫరా చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం కలిపి రెండుసార్లు 78లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం లక్ష్యం కాగా ప్రస్తుత వేసవిలో సరిపడా మంచినీటి సరఫరా జరగడం లేదు. ఫలితంగా పట్టణ ప్రజలకు దాహార్తి తీరడం లేదు. మరోవైపు కొత్త కాలనీల్లో నల్లా నీరు సరఫరా వ్యవస్థ లేదు. దీంతో ఏడాదిగా ఇక్కడ రూ.28కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆయా కాలనీల్లో పైపులైన్ పనులు చేపట్టి నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే వదిలేశారు. ఫలితంగా మంచినీటికి ఇక్కట్లు తప్పడం లేదు.


