● మిల్లర్లకు కలెక్టర్ హైమావతి ఆదేశం
● క్షేత్రస్థాయిలో పరిశీలన
చిన్నకోడూరు(సిద్దిపేట): రైస్ మిల్లర్లు వరి ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని, మిల్లులకు వచ్చిన వాహనాలు 12 గంటల లోపే దిగుమతి చేయాలని కలెక్టర్ హైమావతి మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని రామునిపట్ల, మల్లారం గ్రామాల్లోని రైస్ మిల్లులలో ధాన్యం దిగుమతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలంటే మిల్లులకు పంపించిన ధాన్యాన్ని దిగుమతిలో జాప్యం చేయవద్దన్నారు. ఇందుకు ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రోజూ 30 మంది ఉండేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతి కాగానే ట్రక్ షీట్ జనరేట్, ఓపీఎంఎస్ అప్లోడ్ పెండిగ్ ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. దిగుమతిలో జాప్యం రాకుండా రెవెన్యూ అధికారులను నియమించినట్లు అన్నారు. ఆమె వెంట జిల్లా సవిల్ సప్లై అధికారి తనూజ, జిల్లా తూనికల కొలతల అధికారి శివరంజని, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


