చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ ప్రచార హోర్డింగ్లు, ఫ్లెక్సీల వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రచారాల కోసం ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీల కారణంగా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల రాకపోకలు కనిపించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రచారాలు చేసే అధికారులే ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ కేంద్రంలో హోర్డింగ్, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ పట్టణంలోని పోలీస్స్టేషన్ పక్కనే నడిరోడ్డుపై భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.


