గజ్వేల్రూరల్: అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ 18ఏళ్ల పైబడి ఆరోగ్యవంతులైన యువతీ, యువకులు రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి జరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. 3నెలలకోసారి రక్తదానం చేయవచ్చన్నారు. ఈనెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదానం చేయాలనుకునే వారు మరిన్ని వివరాలకు 99084 72511, 95505 34471 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వర్గల్(గజ్వేల్): గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న హైదరాబాద్లో జరిగే ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలపై రాష్ట్ర స్థాయి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం వర్గల్ మండలం నాచారం అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ ఫౌండేషన్ పోస్టర్ను విడుదల చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం జరిగే ఈ సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య విరోచిత పోరాటం ఎనలేనిదని కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పొతుగంటి రవికాంత్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కురుమ సంఘం భవనంలో దొడ్డికొమురయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దొడ్డికొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య విరోచిత పోరాటం, వీర మరణం తీరును కొనియాడారు. కార్యక్రమంలో కురుమ ఉద్యోగులు, సంఘం నాయకులు, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
6న గద్దర్ ఫౌండేషన్ సభ
దొడ్డి కొమురయ్య
త్యాగం ఎనలేనిది
ఘనంగా జయంతి ఉత్సవాలు
ఫ్లెక్సీ రగడ.. ఉద్రిక్తత
● బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర నినాదాలు
● పోలీసుల జోక్యంతో వివాదం కొలిక్కి
సిద్దిపేటజోన్: ఫ్లెక్సీ రగడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ఒకదశలో ఇరుపార్టీల నేతలు పరస్పరం నినాదాలు చేయడంతో గురువారం అర్ధరాత్రి వరకు జిల్లా కేంద్రంలో టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నట్టు సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒకదశలో కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ చింపిన కేసు తీవ్రతరమైన అంశం కాదని నోటీసులు జారీ చేస్తామని పోలీసులు సూచించారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా సహకరించాలని ఇరు పార్టీలకు పోలీసులు సూచించారు. పోలీసు అధికారుల సూచనలతో కాంగ్రెస్ నేతలు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.