న్యూస్రీల్
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
గంటన్నర పాటు లైన్లో ఉంటే..
పెట్రోల్ కోసం ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వచ్చా. మూడు బంక్లు బంద్ ఉన్నాయి. పాత బస్టాండ్ బంక్ వద్ద గంటన్నర పాటు లైన్లో ఉంటే రూ.200 పెట్రోల్ పోశారు. రోజు ఇంటింటికి వెళ్లి బట్టలు ఉతుకుతాను. రోజుకు రూ.100 పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఒక వైపు గ్యాస్.. మరో వైపు పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతున్నాం.
–బాలకిషన్, సిద్దిపేట
ఇబ్బందులే..
ఫ్యామిలీతో బయటకు వచ్చాను. పెట్రోల్ పోయించుకుందామని అన్నీ పెట్రోల్ బంక్లు తిరిగా.. ఎక్కడా దొరకలేదు. ఇక్కడ ఉందని తెలిసి బంకుకు చేరుకున్నా. రోజు రూ.300 పెట్రోల్ ఖర్చు అవుతుంది. పెట్రోల్ కొరత ఏర్పడితే కరెంట్ బిల్లు చెల్లించేందుకు సైతం ఇబ్బందే..
– అరవింద్, గాడిచర్లపల్లి
జిల్లాలో మొత్తం 193 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. వీటికి ఇండియన్ ఆయిల్, హెచ్పీ, బీపీ ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది. జిల్లాకు సుమారు రోజూ లక్ష లీటర్ల పెట్రోల్, 3లక్షల లీటర్ల డీజిల్ సరఫరా జరుగుతోంది. కానీ మూడు రోజులుగా సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో పలుచోట్ల బంకులు తాత్కాలికంగా మూసివేశారు. నోస్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రో కొరత ఏర్పడిందనే వార్త దావానలంలా వ్యపించడంతో అందరూ బంకుల వద్ద బారులుతీరారు. పెట్రోల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల వద్దకు వాహనదారులు పెద్ద ఎత్తున పోటెత్తుతుండటంతో రద్దీ నెలకొంది. అవసరం లేకున్నా రోజువారి కంటే రెండింతలు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేశారు. బంకులు బంద్ కావడంతో అవసరం ఉన్న చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బండ్లు మధ్యలోనే ఆగిపోవడంతో చాలా మంది బాటిళ్లలో తీసుకెళ్లారు.
కృత్రిమ కొరతా?
బంకుల యజమానులకు కంపెనీలు రూ.20 లక్షల వరకు క్రెడిట్ ఇచ్చేవి. ఇప్పుడు మొత్తం డిపాజిట్ చేస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో డీలర్లు ఎప్పటికప్పుడు డిపాజిట్ చేయకపోవడంతో కంపెనీలు సరఫరా నిలిపివేస్తున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధనం రావడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయనే డీలర్లు పెట్రోల్, డీజిల్లను కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అధికారులు చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
జిల్లాలో ఇంధన కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. గృహాలు, హోటళ్లలో గ్యాస్ కొరతతో వంటలు.. పెట్రోల్, డీజిల్ కొరతతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. మంగళవారం పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద బారులు తీరుతున్నారు. చాలా మంది తమ వాహనాలకు ఫుల్ ట్యాంకు చేయిస్తుండగా, మరికొందరు బాటిళ్లలో, క్యాన్లలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట


