● కలెక్టర్, ఎన్నికల అధికారి హైమావతి ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
సాక్షి, సిద్దిపేట: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు త్వరగా బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్ల పాత్ర చాలా ముఖ్యమన్నారు. 2002లోని ఓటరు జాబితా, 2025 ఓటరు జాబితా సరిపోల్చుకొని జాబితాలో తీసివేతలు, కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియ జరగనుందన్నారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధుల అభ్యర్థన మేరకు బూత్ స్థాయి ఏజెంట్లకు, అధికారులకు శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఓటరు నమోదుపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మోహన్ లాల్, భైరీ శంకర్, అనిల్ కుమార్, మునీర్, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ బాలరాజ్లు పాల్గొన్నారు.


