త్వరలో అధ్యాపకులను నియమిస్తాం
● మంత్రి కొండా సురేఖ
● ములుగు అటవీ కళాశాలలో దశాబ్ది ఉత్సవాలు
ములుగు(గజ్వేల్): అటవీ కళాశాలలో అధ్యాపకుల నియామకానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండాసురేఖ తెలిపారు. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కను నాటి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యాపకుల నియామకాలలో రిజర్వేషన్ల పెంపు దిశగా కృషి చేస్తానన్నారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో ఎఫ్సీఆర్ఐ సంస్థ ముందంజలో ఉందన్నారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని మంత్రి ప్రశంసించారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి సన్మానించారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సి.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ బీఎస్సీ అటవీ శాస్త్ర ప్రవేశ విధానంలో మార్పులు అవసరమన్నారు. ఇంటర్మీడియెట్ మార్కులకు, ఈఏపీసెట్ ర్యాంక్కు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమతుల్యమైన, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానం అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి సువర్ణ, ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్లర్ దండ రాజిరెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రియాంక వర్గీస్, ఎస్.జె.ఆశ, కళాశాల డీన్ వి. కృష్ణ, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్రావు, డిప్యూటీ డైరెక్టర్ కవిత, అధ్యాపకులు పాల్గొన్నారు.


