
బ్యాంకు గ్యారంటీలకు ససేమిరా
● బీజీలు ఇవ్వని మూడింట రెండోవంతు రైసు మిల్లర్లు ● 94 మిల్లులకుగాను ఇచ్చింది కేవలం 33 మిల్లులే ● వారికే సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామంటున్న అధికారులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కస్టం మిల్లింగ్ పేరుతో సర్కారు ధాన్యాన్ని తీసుకుని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైసుమిల్లర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన నిబంధనలు మెదక్ జిల్లాలో అమలు కావడం లేదు. బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు ఇస్తేనే కస్టం మిల్లింగ్ కోసం ధాన్యం కేటాయించాలనే నిబంధనను మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఈ యాసంగి కొనుగోలు సీజనులో మిల్లర్లు తీసుకునే ధాన్యానికి బీజీలు ఇచ్చేందుకు ససేమిరా అంటు న్నారు. మూడింట రెండోవంతు మిల్లర్లు ఈ బీజీలు ఇవ్వలేదు. జిల్లాలో మొత్తం 94 రైసుమిల్లులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 33 రైసుమిల్లుల యాజమాన్యాలు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చాయి. మిగిలిన 61 మిల్లర్లు బీజీలు ఇవ్వాలనే నిబంధనను పెడచెవిన పెడుతున్నారు. దీంతో వీరికి ఈ సీజనులో ధాన్యం కేటాయింపులు ఉంటా యా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మిల్ల ర్లు తాము తీసుకునే ధాన్యానికి సంబంధించి బ్యాంకుల నుంచి గ్యారెంటీ ఇవ్వాలి. ఒకవేళ తీసుకున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా ప్రభుత్వం రాబట్టుకుంటుంది. ఈ నిబంధన జిల్లా లో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
ఊపందుకుంటున్న సేకరణ సీజను...
మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణ సీజను ప్రారంభమైంది. ఈ యాసంగి సీజనులో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 2.01 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, సుమారు 43 వేల ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు లెక్కించారు. రైతులు తమ సొంత అవసరాలు పోగా, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం మినహాయిస్తే...సుమారు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (సన్న, దొడ్డురకాలు కలిపి) ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఈ కేంద్రాల్లో సేకరణ షురువైంది. ఈ నెల 19 నాటికి 312 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇలా ఈ సేకరణ ప్రక్రియ ఊపందుకుంటోంది. కానీ, మిల్లర్లు మాత్రం బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లకు..
బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన మిల్లర్లకు మాత్రమే ఈ సీజనులో సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని మిల్లర్లకు ధాన్యం కేటాయించేది లేదని చెబుతున్నారు. కానీ, రాజకీయ ఒత్తిళ్లు వస్తే...సర్కారు ధాన్యాన్ని మిల్లర్లకు కట్టబెట్టడం అధికారులకు పరిపాటిగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అక్రమార్కులకు అక్షరాల రూ.214 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కట్టబెట్టారు. ఈ మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని బహిరంగమార్కెట్లో విక్రయించి ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుని రూ.కోట్లకు పడగలెత్తారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా తమకు అందే మామూళ్లను తీసుకుని సర్కారు ధాన్యాన్ని అప్పనంగా అక్రమ మిల్లర్లకు అప్పగించారనేది బహిరంగ రహస్యమే. ఈ యాసంగి సీజనులోనైనా ప్రభుత్వం పెట్టిన బ్యాంకు గ్యారెంటీల నిబంధనను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తారా...లేదంటే అక్రమ మిల్లర్లు ఇచ్చే ముడుపులు తీసుకుని బ్యాంకు గ్యారెంటీలు లేకుండా సర్కారు ధాన్యాన్ని కేటాయిస్తారా..? అనేది వేచి చూడాల్సిందే. సాధారణంగా రైతుల సమస్యను సాకుగా చూపి ఏటా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని మిల్లర్లకు రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కట్టబెట్టడం పరిపాటైపోయింది.
బీజీలు ఇచ్చిన వారికే కేటాయింపులు
ఈ బ్యాంకు గ్యారెంటీల విషయమై ‘సాక్షి’ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేశ్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ను సంప్రదించగా.. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీలు ఇవ్వని వారి వద్ద కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.
–మెంచు నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్