3న జిల్లాకు సీఎం రేవంత్‌ | - | Sakshi
Sakshi News home page

3న జిల్లాకు సీఎం రేవంత్‌

May 31 2026 12:04 PM | Updated on May 31 2026 12:04 PM

హత్నూర(సంగారెడ్డి): వచ్చేనెల 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామశివారులోని నూతనంగా నిర్మించిన తెరానియం బయోలాజిక్స్‌ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రానుండటంతో ఏర్పాట్లను శనివారం జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించే పరిశ్రమను పూర్తిగా జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాలు, సభ ఏర్పాట్లు చేసే హాలును, హెలీప్యాడ్‌ను ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాపూర్‌ గ్రామ శివారులోని ఖాళీ స్థలాన్ని కూడా హెలీప్యాడ్‌ స్థలం కోసం ఎస్పీ పరిశీలించారు. పరిశ్రమ వెనుకభాగంలోనే ముఖ్యమంత్రి హెలీప్యాడ్‌ ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్‌ అండ్‌ బీ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రభాకర్‌, సీఐ రమణారెడ్డి, తహసీల్దార్‌ పర్వీన్‌ షేక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రవీందర్‌, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, ఆర్‌ఐ హరిబాబు, పరిశ్రమ ప్రతినిధులు అధికారులున్నారు.

పొగాకుకు

దూరంగా ఉండాలి

జిల్లా న్యాయ సేవాధికార

సంస్థ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి దీప్తి

సంగారెడ్డి టౌన్‌: పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో క్షయ, క్యాన్సర్‌ వంటి రోగాలు వచ్చే అవకాశాలున్నాయని దానికి ప్రతీ ఒక్కరు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి దీప్తి సూచించారు. సంగారెడ్డిలోని కంది జైలులో పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలపై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యువత వ్యసనానికి దూరంగా ఉండాలని అనారోగ్యాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం జైలులోని సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గడ్డపోతారం కమిషనర్‌పై

సస్పెన్షన్‌ వేటు!

జిన్నారం (పటాన్‌చెరు): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన గడ్డపోతారం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామయ్యపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు తెలుస్తోంది. కమిషనర్‌ వెంకటరామయ్య ఇటీవల పలు వ్యాపార సంస్థలకు నోటీసులు జారీచేయడంపై వేటు పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో గుమ్మడిదల కమిషనర్‌ దశరథ్‌ శనివారం ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టడం ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.

ఉద్యోగ విరమణ సహజమే

ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

సంగారెడ్డి జోన్‌: జీవితంలో ప్రతీ ఒక్కరికి ఉద్యోగ విరమణ సహజమేనని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పేర్కొన్నారు. శనివారం పదవీ విరమణ పొందిన ఎస్సై అంజిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ వీరప్పలను ఎస్పీ, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తుంటాయన్నారు. పోలీసు శాఖ తరఫున వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.

ముగిసిన టీజీపీఎస్‌సీ పరీక్షలు

వర్గల్‌(గజ్వేల్‌): గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి కొనసాగుతున్న టీజీపీఎస్‌సీ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు శని వారం ముగిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement