● హత్యా?.. ఆత్మహత్యా? ● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్లో అనుమానాస్పద స్థితితలో వ్యాపారి మృతదేహం ఆదివారం రాత్రి లభ్యమైంది. సిద్దిపేటకు చెందిన వ్యాపారి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. తొగుట మండలం వేములఘట్ గ్రామానికి చెందిన బెల్దే విశ్వనాథం(50)కు భార్య వనిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్లో గ్రామం ముంపునకు గిరైంది. కోల్పోయిన భూములకు డబ్బులు రావడంతో ఆ డబ్బులతో సిద్దిపేట పట్టణంలో ఉంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథం ఈ నెల 2న ఉదయం రియల్ ఎస్టేట్ పనినిమిత్తం పెద్దకోడూరు శివారులోని మెట్టుబండల వద్దకు వెళ్తున్నాని బయటకు వెళ్లారు. 10 గంటల తరువాత విశ్వనాథం.. తన భార్యకు ఫోన్ చేసి రామంచ దగ్గర ఉన్నానని చెప్పారు. తరువాత తన భార్య 11 గంటలకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అప్పటి నుంచి తెలిసిన వారికి ఫోన్ చేయగా ఆచూకి లభించలేదు. దీంతో అతని భార్య చిన్నకోడూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి రంగనాయక సాగర్లో శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వనాథంను చివరిసారిగా ఒక కానిస్టేబుల్ తన కారులో తీసుకుపోయారని మృతుని భార్య వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొంతు నులిపి హత్య చేసి రిజర్వాయర్లో వేశారని ఆరోపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.


