● రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు ● పెన్షన్ కోసం వృద్ధుడి ఆందోళన
హవేళిఘణాపూర్(మెదక్): వ్యక్తి బతికుండగానే అధికారులు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసిన ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 65 ఏళ్లు నిండిన కీసరి పోచయ్య పింఛన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకోగా, మంజూరైంది. కూచన్పల్లి గ్రామ లిస్టులో పేరు వచ్చింది. వారు ఎక్కడదనే విషయం తెలుసుకోకుండానే అతడు మరణించినట్లు రికార్డు చేసి పంపించారు. దీంతో పోచయ్య ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అడుగగా పింఛన్ వచ్చిన తర్వాత మరణించినట్లు నమోదైందని తెలుపడంతో అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని గత కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి విన్నవించగా, అందుకు సంబంధించిన పత్రాలు అందజేయాలని చెప్పడంతో అప్పగించాడు. కానీ ఇప్పటివరకు తనకు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు పింఛన్ వచ్చేలా చూడాలని కోరుతున్నాడు.


