సంగారెడ్డి క్రైమ్/హత్నూర (సంగారెడ్డి): మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో పనులు దొరకక ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు ఏప్రిల్ 1 నుంచి ఒకేసారి మూడు నెలల బియ్యం ఇచ్చేందుకు అధికారులకు ఏర్పాటు చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ పరిధిలోని 855 రేషన్ దుకాణాల ద్వారా 4,42,746 మంది లబ్ధిదారులకు రేషన్ దుకాణాలకు సన్నబియ్యం అందనున్నాయి. బియ్యం నిల్వ చేసేందుకు అవసరమయ్యే భవనాలను సిద్ధం చేసుకోవాలని డీలర్లకు ఇప్పటికే అధికారులు సమాచా రం ఇచ్చా రు. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో చాలామంది లబ్ధిదారులు బియ్యాన్ని తప్పకుండా తీసుకుని వాడుకుంటున్నారు. మూడు నెలల బియ్యం కోట సుమారు 28457.358 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది.
గ్రామాల్లో తలెత్తనున్న సాంకేతిక సమస్య
ఒకేసారి మూడు నెలల కోట తీసుకోవాలంటే లబ్ధిదారుల నుంచి ఈ పాస్ మిషన్పై మూడుసార్లు బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా బియ్యం ఇవ్వనున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక కార్డు పూర్తి కావడానికి 10 నుంచి 15 నిమిషాల సమ యం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు వారాలపాటు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇబ్బందుల్లేకుండా పంపిణీ చేస్తాం
గతంలోలా కాకుండా ప్రస్తుతం కొత్తగా 64,235 కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడంతో బియ్యం సరఫరా కోటాను పెంచాల్సి వచ్చింది. ముందుగా లబ్ధిదారులు ఈ కేవైసీ నమోదు చేసుకోవడం మరవద్దు. ఏప్రిల్ 1 నుంచి ప్రతీరోజు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ ఒకరికి నెలకు 6 కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోలు తీసుకోవాలి.
– బాల సరోజ,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
ఏప్రిల్ 1 నుంచి పంపిణీ
లబ్ధి పొందనున్న 4,42,746 మంది


