సంగారెడ్డి: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం పునరాలోచన చేసి వారికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులను పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుగౌడ్ పాల్గొని మాట్లాడారు. బడ్జెట్లో బీసీలకు కేవలం నాలుగు శాతం నిధులను కేటాయించడం అన్యాయమన్నారు. జనాభాలో 56% పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కల్పించలేదని గుర్తు చేశారు. కనీసం 25 వేల కోట్ల రూపాయలు తక్షణమే కేటాయించాలని లేదంటే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కావేరి ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు చంద్రయ్యస్వామి తదితరులున్నారు.
● బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి
● బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్


