సదాశివపేట(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో గురువారం సదాశివపేటలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సింగూర్, మంజీర ప్రాజెక్టులకు నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి కాల్వల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గంగకత్వ, నారింజ, నల్లవాగు, మల్కాపూర్ చెరువులకు నిధులు కేటాయించి కాలుష్యం బారినపడిన నక్కవాగు, మంజీర జలాలను శుద్ధి చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో వందపడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించి, పారిశ్రామికవాడల్లో కనీస మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించడం కోసం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తారా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గుర్తింపు కోసం కృషి చేయాలని, అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని, రాజీవ్ గృహకల్ప పెండింగ్ ఇళ్లను పూర్తి చేయాలని, మున్సిపాలిటీల్లో పార్కులు, ఇండోర్ స్టేడియాలను అభివృద్ధి చేయలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశం, ఎం.నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, నర్సింహులు, కృష్ణ, రమేశ్ పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలి
సింగూర్, మంజీర ప్రాజెక్టులకు నిధులివ్వాలి
మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వాన్ని డిమాండ్
చేసిన సీపీఎం


