మూగ జీవాలకు ఆవాసం
● ఇతర జిల్లాల నుంచి మేత, నీటి కోసం వలస
● భూముల్లో ఎరువు కోసం గొర్రెల మంద
● రూ.6 వందల నుంచి వేయి వసూలు
మునిపల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న గ్రామాలు మూగ జీవాలకు ఆవాసంగా మారాయి. పత్తి తీసిన తరువాత చేన్లను మేపేందుకు ఇతరత్రా జిల్లాల నుంచి గొర్రెలు, మేకలను తీసుకొని కాపరులు వలస వస్తున్నారు. పొద్దస్తమానం అక్కడ, ఇక్కడ గొర్రెలను మేపుకుంటూ రాత్రికి మంద వేసినందుకు రూ.600 నుంచి వెయ్యి వరకు రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటారు. రాత్రి సమయంలో గొర్రెలు బయటకు రాకుండా ఉండడానికి మంద చుట్టూ వల కట్టి కాపలా ఉంటారు. వీటి ఎరువు వ్యవసాయ భూములకు బలంతో పాటు పంట దిగుబడి వస్తుందని రైతులకు నమ్మకం. గొర్రెలు, మేకల ఎరువు కోసం రైతులు తమ వ్యవసాయ భూముల్లో మంద పెట్టించుకుంటున్నారు. ఉదయం వెళ్లి తిరిగి సాయంత్రం అదే చేనులో మంద నిర్వహిస్తూ, అక్కడే భోజనం చేస్తారు. గొర్ల ఎరువు మంద అవసరమున్న రైతులు వచ్చి ముందే మాట్లాడుకుని మంద వేసుకుంటుంటారు. గొర్రెలకు నీళ్లు, మేత దొరకడంతో పాటు మందలు వేస్తూ ఇలా రెండు విధాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. మంద వేసిన చేన్లలోనే కాపరులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రైతుల భూముల్లో మంద వేసిన డబ్బులతో పాటు మూగ జీవాలకు ఎదైనా వ్యాధి వస్తే చికిత్స చేయిస్తారు.


