రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
వెల్దుర్తి(తూప్రాన్): తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్లో మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని వైష్ణవి ప్రతిభ చాటింది. సోమవారం మెదక్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వంద మంది విద్యార్థులు పాల్గొనగా వైష్ణవి ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. దీంతో డీఈఓ విజయ ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని సోషల్ ఫోరమ్ మండల కన్వీనర్ నాగరాజు, చందర్, శ్రీనివాస్, ప్రభాకర్, లక్ష్మణ్ తదితరులు అభినందించారు.
మెదక్ కలెక్టరేట్: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ మహేశ్ వివరాల ప్రకారం... సోమవారం మెదక్ పట్టణ శివారులో బోధన్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కమ్మరి రాములు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా బైక్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి మూడు బైక్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కాగా రాములు గతంలో మెదక్ పట్టణంతోపాటు రామాయంపేట పరిసర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి జైలు శిక్ష కూడా అనుభవించాడు.
జహీరాబాద్ టౌన్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లా బంటారం మండలం తొరమామిడికి చెందిన జనార్దన్(45) జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కటింగ్ షాపులో పనిచేస్తూ జీవిస్తున్నాడు. 8 నెలల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జనవరి 28న స్వగ్రామానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. మరోసటి రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది. భార్య మంజుల అత్తకు ఫోన్ చేసి జనార్దన్ ఊరికి వచ్చాడా అని అడుగగా రాలేదని చెప్పింది. దీంతో ఆయన కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
తూప్రాన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... సోమవారం పట్టణ సమీపంలోని అల్లాపూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో మినీ వ్యాన్లో 11.90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా వెల్దుర్తి మండలం కోమటిపల్లికి చెందిన కై లాస్ శ్రీనివాస్కు చెందినవిగా తెలిపారు. పట్టుబడిన రేషన్ బియ్యంను సివిల్ సప్లయి గోడౌన్ ఇన్చార్జి నర్సింహులుకు అప్పగించి డైవర్ కృష్ణతో పాటు బియ్యం యాజమాని శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు.
ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష
గజ్వేల్రూరల్: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి కోర్టు జైలు శిక్ష విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలో పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. సోమవారం వారిని గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. విచారణ అనంతరం 8 మందికి రూ. 71వేల జరిమానా, మరో ఇద్దరికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఏడుగురికి రూ.35వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక


