ఆటో, ఐచర్ వాహనం ఢీకొని..
న్యాల్కల్(జహీరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని గణేశ్పూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... ఝరాసంగం మండల పరిధిలోని భోజ్యానాయక్ తండాకు చెందిన అంభ్యనాయక్(60), భార్య దీదీబాయి, మనుమలు అభిషేక్(8), కార్తీక్(6), భువనేశ్వర్(4)లతో కలిసి బీదర్ సమీపంలో గల బగ్దల్ తండాకు ప్యాసింజర్ ఆటోలో వెళ్తున్నారు. గంగ్వార్ మీదుగా ఆటో వెళ్తున్న క్రమంలో మండల పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కమలమ్మతో పాటు మరో మహిళ అదే ఆటో ఎక్కారు. ఈ క్రమంలో బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనం గణేశ్పూర్ గ్రామ శివారులో జహీరాబాద్–బీదర్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న అంభ్యనాయక్, కమలమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. అంభ్యనాయక్ భార్య దీదీబాయి, మనువళ్లు అభిషేక్, కార్తిక్, భువనేశ్వర్, మరో మహిళ, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హద్నూర్ ఎస్ఐ సుజిత్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన వారిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఉత్సవాలకు వెళ్తుండగా ప్రమాదం...
భోజ్యానాయక్ తండాకు చెందిన అంభ్యనాయక్ అత్తగారి ఊరైన బగ్దల్ తండాలో సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం అంభ్యనాయక్ భార్య, మనుమలతో ఆటోలో బయలు దేరాడు. మరి కొద్ది సేవాట్లో గమ్యస్థానానికి చేరుకుంటామని సంతోషంలో ఉండగా ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కళ్లేదుటే తాత మృతి చెందడం, అవ్వ గాయాలకు గురి కావడం, గాయాలైన చిన్నారుల రోదనలు మిన్నంటాయి. గాయాలైన చిన్నారులు తాత, అవ్వ అంటూ ఏడవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుజిత్ తెలిపారు.
ఇద్దరు మృతి..
గాయాలైన ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు
ఓ చిన్నారి పరిస్థితి విషమం
సేవాలాల్ ఉత్సవాలకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం
ఆటో, ఐచర్ వాహనం ఢీకొని..


