2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● 11వ తేదీ వరకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులు ● హాజరుకానున్న 20,049 మందివిద్యార్థులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫిబ్రవరి 2నుంచి 11వ తేదీ వరకు రెండు విడతల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. మొదటి విడతకు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు 18 పరీక్ష కేంద్రాల్లో, రెండవ విడత ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు 28 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సును అభ్యసిస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. ప్రైవేట్ కళాశాలలో గల పరీక్ష కేంద్రాల్లో గ్రౌండ్ఫ్లోర్లోనే ప్రయోగ పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.
హాజరుకానున్న 20,049 మంది విద్యార్థులు
జిల్లాలో 46 ఇంటర్మీడియెట్ కళాశాలలున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి రెండవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న వారికి మాత్రమే ఈ పరీక్షలుంటాయి. ఫిజిక్స్, రసాయన శాస్త్రం విద్యార్థులు 11,054 మంది కాగా, జంతుశాస్త్రం, జీవశాస్త్రం విద్యార్థులు 5,222 మంది ఉన్నారు. వీరితోపాటు ఒకేషనల్ చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1,865 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,908 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు.
ఆన్లైన్ ద్వారా ప్రశ్నపత్రం
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కొన్ని ప్రైవేట్ కళాశాలలు ముందే లీకేజీ చేస్తున్నాయనే ఆరోపణలు రావడంతోపాటు ప్రాక్టికల్స్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా వుండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలకు అరగంట ముందే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానంలో పరీక్ష కేంద్రం ఎగ్జామినర్కు ఆన్లైన్లో పంపుతారు. ఇందుకోసం ఎగ్జామినర్ సెల్ఫోన్కు మెసేజ్ రాగానే అతడు సంబంధిత వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్విజిలేటర్లకు అందజేస్తారు. హాల్ టికెట్ ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసి ఇవ్వాల్సి వుంటుంది. పరీక్ష ముగించే గంట లోపు వాల్యుయేషన్ చేసి మార్కుల జాబితాను ఎగ్జామినర్ బోర్డుకు అప్లోడ్ చేయాల్సి వుంటుంది.


