జాతరలో తప్పిపోయి.. 29 ఏళ్లకు సొంతింటికి
రేగోడ్(మెదక్): మూడేళ్లు ఉన్నప్పడు జాతరలో తప్పిపోయిన కుమారుడు 29 ఏళ్ల తరువాత సంక్రాంతి పండుగకు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. వివరాలు ఇలా... మండలంలోని పెద్దతండాకు చెందిన రూప్సింగ్, దేవీబాయికి నలుగురు కొడుకులు, ఒక కూతురు. 29ఏళ్ల క్రితం అల్లాదుర్గంలోని బేతాళస్వామి జాతరకు వెళ్లారు. అక్కడ మూడో కుమారుడు రవి(3) తప్పిపోయాడు. ఎంత వెతికినా జాడ కనిపించలేదు. ఇది ఇలా ఉండగా... మూడేళ్ల క్రితం నాలుగో కుమారుడు గణేశ్ ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ట్రాక్టర్ నాగల్గిద్ద మండలంలోని దామరగిద్ద తండా వాసిది. ఆ ట్రాక్టర్ యజమానితో పలుమార్లు మాట్లాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 29న మరోసారి అక్కడికి వెళ్లగా.. ఆ తండావాసులు రూప్సింగ్ కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు. అప్పడు 29 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కుమారుడు రవి ఆ తండాలోనే ఉన్నాడన్న విషయం బయట పడింది. దీంతో రవి దగ్గరకు వెళ్లి పుట్టుమచ్చలు, ఇతర గుర్తులను గుర్తుపట్టడంతో తన కుమారుడే అని తెలిసింది. పెద్దతండాకు రావాలని తండ్రి రూప్సింగ్ కుమారుడిని కోరగా.. సంక్రాంతికి భార్య, పిల్లలతో రవి రావడంతో ఆ కుటుంబంలో సంబురాలు మిన్నంటాయి.
జాతరలో తప్పిపోయి.. 29 ఏళ్లకు సొంతింటికి


