
అర్బన్ పార్కు పనులు పూర్తి చేయాలి
అటవీ అధికారులకు
జాగో తెలంగాణ సంఘం వినతి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణ సమీపంలో చేపట్టిన అర్బన్ పార్కు పనులు పూర్తి చేయాలని జాగో తెలంగాణ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు నేత తదితరులు అటవీశాఖ జిల్లా అధికారి శ్రీధర్రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాములు నేత మాట్లాడుతూ..రూ.లక్షల వ్యయంతో చేపడుతున్న అర్బన్ పార్కు పనులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించాలని, పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ను నిర్మించాలని కోరారు.
ప్రభుత్వ బడుల్లో
గుణాత్మక విద్య: డీఈఓ
పటాన్చెరు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్నాపూర్, రుద్రారం ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను తిరిగి పరిశీలించి, గణితం బోధిస్తున్న అధ్యాపకులు సుందర్రావు తరగతిని గమనించి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు చురుగ్గా సమాధానాలు చెప్పడంతో డీఈఓ అభినందించారు.
యూరియాపై
ఆందోళన వద్దు
జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్
సంగారెడ్డి జోన్: జిల్లాలో యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాకు 38,873 మెట్రిక్ టన్నుల మేరకు అవసరం ఉండగా ఇప్పటివరకు 31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 514 మెట్రిక్ టన్నుల యూరి యా డీలర్ల వద్ద, మార్క్ఫెడ్ శాఖ, బఫర్ స్టాక్ యూరియా 333 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాకు 6,912 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి వస్తుందని చెప్పారు.
టెట్ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి: టీఎస్యూటీఎఫ్
సదాశివపేట(సంగారెడ్డి): ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. గురువారం పట్టణ, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో టెట్ తీర్పుపై సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...2010 తర్వాత నియామకమైన ఉద్యోగులందరికీ టెట్ ఉందని, అంతకుముందున్న ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని గతంలో చెప్పినప్పటికీ ప్రస్తుతం టెట్ను తప్పనిసరి చేస్తూ తీర్పు ఇవ్వడం సరైందికాదన్నారు.
భూ రీసర్వేను నిలిపేయండి
అధికారులకు షాద్నగర్ గ్రామస్తుల వినతి
వట్పల్లి(అందోల్): భూ సమస్యలకు పరిష్కారం చూపని రీసర్వేని నిలిపివేయాలంటూ మండల పరిధిలోని షాద్నగర్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వ్రాసిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. గురువారం గ్రామానికి వెళ్లిన తహసీల్దారు చంద్రశేఖర్తోపాటు సర్వే అధికారులు గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు వారిని ప్రశ్నించారు. ప్రతి సర్వే నంబర్ను పూర్తిగా సర్వే చేయాలన్నారు. సర్వేలో భూ పట్టాపాస్బుక్ ఆధారంగా కేటాయింపులు జరగడం లేదని దీంతో హెచ్చు తగ్గులతో అన్యాయం జరుగుతోందన్నారు. సర్వే ద్వారా భూమస్యలు తొలుగుతాయని సర్వే చేపట్టిన అధికారులు ఎటువంటి పరిష్కారం చూపడంలేదని ఆరోపించారు. పరిష్కారం చూపితేనే సర్వే చేయాలని లేకుంటే నిలిపి వేయాలని తెలిపారు. డిజిటల్ సర్వే ఆధారంగా అధికారులు రికార్డులను రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యే క్రమంలో ఇలా అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

అర్బన్ పార్కు పనులు పూర్తి చేయాలి

అర్బన్ పార్కు పనులు పూర్తి చేయాలి