
క్రషింగ్ అనుమానమే!
● సీజన్ ప్రారంభానికి రెండు నెలలే గడువు ● ‘ట్రైడెంట్’లో క్రషింగ్ లేకపోతే ప్రత్యామ్నాయం చూపాలంటున్న రైతులు ● ఈసారి జిల్లాలో పెరిగిన చెరుకు విస్తీర్ణం
చెరుకు విక్రయించడం రైతులకు సవాల్గా మారింది. రెండు నెలల్లో చెరుకు క్రషింగ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండేళ్లుగా మూసివున్న ట్రైడెంట్ కర్మాగారంలో ఈ ఏడాది కూడా క్రషింగ్ జరుగుతుందో లేదోనన్న అనుమానాలు చెరుకు రైతుల్ని
వెంటాడుతున్నాయి. దీంతో జిల్లాలోని ఇతర కర్మాగారాలపై ఆధారపడాల్సి రావడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
జహీరాబాద్ టౌన్: జిల్లాలో ఈ సంవత్సరం చెరుకు సాగు విస్తీర్ణం పెరిగింది. చెరుకు సాగులో జహీరాబాద్ డివిజన్ టాప్లో ఉంది. జహీరాబాద్ సమీపంలో ట్రైడెంట్, సంగారెడ్డి వద్ద గణపతి, రాయికోడ్ వద్ద గోదావరి–గంగా చక్కెర పరిశ్రమలున్నాయి. ఈ మూడు చక్కెర కర్మాగారాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో చెరకు పంట సాగవుతునట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 3 వేల ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 10 లక్షల టన్నుల చెరుకు పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా అందులో 50% జహీరాబాద్లో పండనుంది.
ఈసారి కూడా తరలింపు తప్పదా!
జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం రెండేళ్ల నుంచి గానుగ ఆడించడంలేదు. ఈసారి కూడా స్పష్టత లేకపోవడంతో పంటను ఇతర కర్మాగారాలకు తరలింపు తప్పని పరిస్థితులున్నాయి. ఈ ప్రాంతంలో పండించిన పంటను సంగారెడ్డి గణేష్ షుగర్స్, కామారెడ్డి గాయత్రి, కొత్తకోట కృష్ణవేణితోపాటు పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని మిల్లులకు రైతులు పంటను తరలిస్తున్నారు. రాయికోడ్ మండలంలోని మాటూర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన గోదావరి–గంగా కర్మాగారంలో క్రషింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. దీంతో రైతులు బ్రోకర్స్ను ఆశ్రయించడంతో నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా పంట సరఫరా కోసం రైతులకు తిప్పలు తప్పేటట్లు లేదు. షుగర్ క్రేన్ అధికారులు జోక్యం చేసుకుని ట్రైడెంట్ కర్మాగారంలో క్రషింగ్ జరిపించాలని, లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
టన్నుకు రూ. 3 వేలు చెల్లించాలి
చెరుకు పంట ద్వారా లాభం తగ్గినా నష్టం అంతగా ఉండదని గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా ప్రతీ ఏటా పంట వేస్తున్నాం. స్థానిక కర్మాగారంలో క్రషింగ్ లేక నష్టపోవాల్సి వస్తోంది. కొన్నేళ్ల నుంచి బ్రోకర్లను ఆశ్రయిస్తున్నాం. టన్నుకు రూ. 2,500 వేలు ఇవ్వడంవల్ల లాభాలు రావడం లేదు. పెట్టుబడులు పెరిగినందున టన్నుకు రూ.3 వేలు చెల్లించాలి.
–డి.శివకుమార్, ఎల్గోయి, జహీరాబాద్

క్రషింగ్ అనుమానమే!