
నీవు లేని లోకంలో ఉండలేను..
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
● భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
● అనాథలైన పిల్లలు
సిద్దిపేటరూరల్: అనారోగ్యంతో భర్త మృతిచెందగా, ఒకరోజు గడవక ముందే భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ సైఫ్అలీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొబ్బరిచెట్టు మహేందర్(40)కు చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్కు చెందిన కావ్యతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం మహేందర్ అనారోగ్యానికి గురి కాగా, సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య కావ్య గంటల వ్యవధిలోనే ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించగా, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కావ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
బావిలో దూకి యువకుడి ఆత్మహత్య
పెద్దశంకరంపేట(మెదక్): జైలు నుంచి వచ్చిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముసాపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బైకాని దేవయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇందులో చిన్నవాడైన బైకాని గంగమేశ్వర్కు కొన్నేళ్ల క్రితం టేక్మాల్ మండలం హసన్మహ్మద్పల్లికి చెందిన మానసతో వివాహం జరిగింది. గంగమేశ్వర్ అత్తగారింటికి ఇల్లరికం వెళ్లాడు. మూడు నెలల క్రింతం కుటుంబ కలహాల నేపథ్యంలో మానస ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గంగమేశ్వర్పై కేసు నమోదు కాగా జైలుకు కెళ్లాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చాడు. శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగాఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబీకులు వెతుకుతుండగా గ్రామశివారులోని బావిలో మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోల్కంపల్లి సంజీవులు(39) కూలీ పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఆయన శుక్రవారం మండలంలోని ఆత్మకూర్ శివారులోని రావుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్షించేందుకు స్థానికులు ప్రయత్నం చేసిన ఫలితం రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చేగుంట(తూప్రాన్): చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పోలంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి లక్ష్మి (42)కి పంచాయతీ కార్యదర్శి స్రవంతితో ఇటీవల గొడవ జరిగింది. ఈ గొడవపై గ్రామస్తులు గురువారం గ్రామ పంచాయతీ వద్ద మాట్లాడారు. అయితే ఆ తర్వాతి రోజే లక్ష్మి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పంచాయతీ కార్యదర్శితో జరిగిన గొడవపై మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు.

నీవు లేని లోకంలో ఉండలేను..