
‘సీజనల్’ పంజా
సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లాలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఎక్కడ ఏ దవాఖాన చూసినా రోగుల రద్దీ కనిపిస్తోంది. ఓ వైపు అవుట్ పేషంట్ విభాగంలో రోజుకు సుమారు 1,100కి పైగా కేసులు నమోదవుతుండగా మరోవైపు వైద్యులు, మందుల కొరత ఆస్పత్రులను వేధిస్తోంది. రోగులు గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తూ అసహనం వ్యక్తం చేస్తుండగా మరికొందరు తమ రోగాలను నయం చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులను తప్పనిసరి పరిస్థితుల్లో ఆశ్రయిస్తున్నట్లు ‘సాక్షి’విజిట్ లో వెల్లడైంది.
– సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/
జహీరాబాద్/జోగిపేట(అందోల్)
రోజుకు 1,200 నుంచి
1,800 వరకు ఓపీ, ఐపీ
సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి నిత్యం రోగులతో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,200 నుంచి 1,800 వరకు రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 1,475 మంది అవుట్ పేషంట్లు నమోదు కాగా ఇందులో 92 మంది ఇన్ పేషంట్లుగా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేక ఉన్నవారితోనే రోగులను చూసేందుకు సమయం పడుతుండటంతో రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు చూసేంతవరకు వేచి ఉండలేక కొంతమంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎక్కువశాతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
వైద్యుల్లేరు.. మందుల్లేవు
జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రికి నిత్యం అవుట్ పేషంట్లు 1,000 నుంచి 1,200 వరకు వస్తుండటంతో ఆస్పత్రి రోగులతో నిండిపోతోంది. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడి వైద్యం పొందాల్సి వస్తోంది. పేరు నమోదు కోసం, వైద్యుడిని కలిసేందుకు, మందులు పొందేందుకు గాను మూడు చోట్ల క్యూలో నిల్చోవాల్సి రావడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో పలు రకాల మందుల కొరత కూడా రోగులను వేధిస్తోంది. వాంతుల నివారణ కోసం ఉపయోగించే ఆండిసిట్రాన్, గ్యాస్ట్రిక్ ఇబ్బందులతోపాటు కడుపులో వచ్చే మంట నివారణ కోసం అవసరమై ప్యాంటాప్, ర్యాంటడీన్ ఇంజక్షన్లను రోగులు బయటనుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. కిట్ల కొరత కారణంగా సీబీపీ, వీడీఆర్ఎల్, హెచ్బీఎస్ఏజీ రక్త పరీక్షలను బయట చేయించుకోవాల్సివస్తోందని రోగులు వాపోతున్నారు.
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి 1,100 అవుట్ పేషంట్లు వస్తున్నారు. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో ఉన్న 120 బెడ్లు రోగులతో నిండిపోయాయి. ఇక్కడ సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. ఆర్ధోపెడిక్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ చెబుతున్నారు.
వేధిస్తోన్న వైద్యుల కొరత
ఆస్పత్రిలో ఎనిమిది వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో చిన్న పిల్లలకు సంబంధించిన వైద్యుల పోస్టులు మూడు వరకు ఖాళీగా ఉన్నాయి. కొందరు వైద్యులు ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. పదికి పైగా నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలువురు డిప్యూటేషన్పై వెళ్లినా వారి స్థానాల్లో ఇతరులు చేరలేదు. 25 మంది నర్సులు, 35 మంది నర్స్ ట్రైనీ విద్యార్థులతో సేవలందిస్తున్నారు.
రోగులు ఎక్కువ.. డాక్టర్లు తక్కువ
జోగిపేట ఏరియా ఆస్పత్రిదీ దాదాపు ఇదే పరిస్థితి. సోమవారం ఒక్కరోజే సుమారు 700 మంది అవుట్ పేషంట్లు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకున్నారు. అయితే రోగులకు సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులందరినీ వైద్యులు చూసేందుకు సమయం పడుతుంది. ఈ ఆస్పత్రిలో 21 మంది డాక్టర్లుండగా కేవలం 9 మందే విధులకు హాజరయ్యారు.
–డాక్టర్ అశోక్, ఆర్ఎంఓ
మందులు అందుబాటులో ఉన్నాయి
సాధారణంగా జ్వరాలకు అవసరమయ్యే ఔషధాలన్నీ అందుబాటులోనే ఉన్నాయి. కొన్ని మందులు మాత్రం ఒక్కోసారి రవాణ కారణంగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సైకియాట్రిస్ట్, చర్మవ్యాధులకు సంబంధించిన మందులు మాత్రం ఇక్కడ లభించవు.
–మురళీకృష్ణ,
ఆస్పత్రి సూపరింటెండెంట్, సంగారెడ్డి
మందుల కొరత లేదు
ఆస్పత్రిలో ఎలాంటి మందుల కొరత లేదు. రక్తపరీక్షలు ఆస్పత్రిలోనే చేస్తున్నాం. ఎప్పుడైనా కిట్ల కొరత ఉంటే బయటకు పంపి ఉండవచ్చు. రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు.
–శ్రీధర్, ఏరియా ఆస్పత్రి
సూపరింటెండెంట్, జహీరాబాద్