
కేతకీలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి
ఝరాసంగం(జహీరాబాద్): హైకోర్టు సిట్టింగ్ జడ్జి, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ జ్యూడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శ్రీకేతకీ సంగమేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు, అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అమృతగుండంలో జల లింగానికి పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అర్చకులు అందించి, సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్రావు పాటిల్, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ తగ్గింపుతో మేలు
నారాయణఖేడ్: జీఎస్టీ తగ్గింపు ద్వారా ధరలు తగ్గి పేదలకు మేలు జరిగేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కృషి చేశారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పత్తిరి రామకృష్ణ పేర్కొన్నారు. జీఎస్టీ ద్వారా ధరలను తగ్గించినందుకు గాను శుక్రవారం ఖేడ్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ పేదల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీదేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో ఖేడ్ మండలశాఖ అధ్యక్షుడు దశరథ్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, నాయకులు సుగుణాకర్, మానిక్, సాయేందర్, సిద్ధయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.
సింగూరుకు
కొనసాగుతున్న వరద
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి 25,010 క్యూసెక్కులు వస్తుండగా...అంతే నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. జలవిద్యుత్ కేంద్రానికి 2,250 క్యూసెక్కులు వదులుతుండగా రెండు టర్బయిన్లతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్లో 16.500 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు.
దేశ భవిష్యత్తును
తీర్చిదిద్దేది గురువులే
మాజీ డీజీపీ మహేందర్రెడ్డి
సంగారెడ్డి టౌన్ : ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి సంపన్నులని మాజీ డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి మండలంలోని ఎమ్మెన్నార్ కళాశాలలో టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని దేశాభివృద్ధికి జాతి నిర్మాణానికి కీలకమన్నారు. టీచర్ల వల్లే ప్రతీ విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి రూ.25 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెన్నార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎం.ఎన్.రాజు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.