
డీమ్డ్ వర్సిటీల్లో లోపించిన నాణ్యత
ఎమర్జింగ్ కోర్సులపై ప్రచార అట్టహాసమే
కాలం చెల్లిన కోడింగ్తో నిలువెల్లా దగా
తొలి మెట్టులోనే వెనక్కు పంపుతున్న టెక్ సంస్థలు
వీటిపై నియంత్రణ ఉండాల్సిందేనని రాష్ట్ర వాదన
ఏఐసీటీఈకి లేఖ రాసేందుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టికి తీసుకెళ్లేదుకు సిద్ధమైంది. డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఏఐసీటీఈకి వివరించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు గురువారం చర్చించారు.
ప్రభుత్వ సూచనల మేరకు ఏఐసీటీఈకి లేఖ రాసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డీమ్డ్ వర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న తీరు, దీనివల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని అందులో వివరించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎమర్జింగ్ కోర్సుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రమాణాలు లేని బోధన జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.
కాలం చెల్లిన కోడింగ్
గత ఏడాది డీమ్డ్ వర్సిటీల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులు కొన్ని రకాల కోడింగ్ మాత్రమే చేయగలుగుతున్నారు. ఏఐ వచి్చన తర్వాత పాతతరం కోడింగ్, డీకోడింగ్ అవసరమే లేకుండా పోయింది. అడ్వాన్స్డ్ కోడింగ్ను సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇవేవీ డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో కన్పించడం లేదని సాంకేతిక విద్య అధికారులు అంటున్నారు. డ్రిస్కియేట్ మేథమెటిక్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్ లేబోరేటరీపై బేసిక్స్ తప్ప, ఏఐ సమాంతర బోధనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని గుర్తించారు. కొన్ని సంస్థల కోసం జరిగే ఇంటర్వ్యూల్లో కీలకమైన బిజినెస్ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్పై కనీస పరిజ్ఞానం కూడా విద్యార్థుల్లో ఉండటం లేదని టెక్ కంపెనీలు అంటున్నాయి.
అడ్డగోలు ప్రవేశాలు
తెలంగాణలో మొత్తం పదివరకు డీమ్డ్ వర్సిటీలున్నాయి. వీటిలో కొన్ని ఆఫ్ క్యాంపస్ బ్రాంచీలున్నాయి. డీమ్డ్ హోదా ఉన్న సంస్థలు తెలంగాణలో బ్రాంచీలు పెట్టాయి. భూమి, మౌలిక వసతులు, కొన్నేళ్లుగా సాధించిన ర్యాంకుల ఆధారంగా డీమ్డ్ హోదాను ఏఐసీటీఈ ఇస్తుంది. ఈ హోదా వచి్చన వర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. అడ్మిషన్లు కూడా వాళ్ల ఇష్టమే.
ఇష్టానుసారం అన్ని బ్రాంచీల్లోనూ సీట్లు పెంచుకోవచ్చు. డీమ్డ్ హోదా కోసం సంస్థలు వ్యూహాత్మకంగా జాతీయ ర్యాంకులు వచ్చేలా చూసుకుంటున్నాయి. ర్యాంకులిచ్చే జాతీయ సంస్థలకు ఇవి అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు అన్స్కిల్డ్ ఉద్యోగాల్లో చేరినా, వాటిని ర్యాంకింగ్ డేటాలో స్కిల్డ్గానే చూపిస్తున్నాయి. ఇలా హోదా తెచ్చుకున్న తర్వాత నియంత్రణ లేకుండా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఒక్కో యూనివర్సిటీ ఇంజనీరింగ్లో ఏకంగా 3 వేలకుపైగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది.
ఇందులో ప్రధానంగా డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులే ఉంటున్నాయి. అయితే, ఇంతమందికి సరిపడా ఫ్యాకల్టీ ఎలా తెస్తున్నారు? బోధించేవాళ్ల నాణ్యత ఎంత? అనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో చదివిన విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ఇటీవల రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం డేటా తెప్పించి పరిశీలించింది. కంప్యూటర్ సైన్స్ చదివిన వారిలో కనీసం 32 శాతం కూడా సరైన ఉద్యోగాలకు ఎంపికవ్వడం లేదని గుర్తించారు.
పనికి మాలిన ప్రాజెక్టులు
ప్రతీ కంపెనీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి అనుసంధానమయ్యాయి. దానిని నిర్వహించే ఉద్యోగ అర్హతలకు కొన్ని ప్రాజెక్టులు ఇంజనీరింగ్లోనే చేయాలి. అయితే, డేటా అనలిటిక్స్ లేబొరేటరీల్లో సాధారణ ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్లో చేసే ప్రాజెక్టుల్లో ఎక్కడా ఏఐ కోడింగ్, మాడ్యూల్స్పై అధ్యయనం చేసిన దాఖలాలు డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో ఉండటం లేదని సాంకేతిక విద్య అధికారి ఒకరు తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో ఎథి్నకల్ హ్యాకింగ్, థ్రెట్ ఇంటిలిజెన్స్, ఢిజిటల్ ఫోరెన్సిక్స్ వంటి సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం కన్పించడం లేదని అధికారులు సేకరించిన డేటా స్పష్టం చేస్తోంది. బోధన నాణ్యతమై ఆడిటింగ్ జరిగితే తప్ప డీమ్డ్ వర్సిటీలు చేస్తున్న అన్యాయం వెలుగులోకి రాదని ఒక ఉన్నతాధికారి తెలిపారు.