● నీట మునిగి ఒకరి మృతి
● మరో యువకుడి గల్లంతు
రాజేంద్రనగర్: హిమాయత్ సాగర్లో సరదాగా చేపల వేటకు వెళ్లి.. వలలు వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ఒకరు నీటిలో మునిగి మృత్యువాత పడగా.. మరొకరు గల్లంతయ్యారు. ఇంకొకరిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన ఆదివారం రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి హకీంపేట్ కాలనీకి చెందిన షాబాజ్ (24), సమీర్ (22), పీరంచెరువు ప్రాంతానికి చెందిన సల్మాన్ (22) స్నేహితులు. వీరు ముగ్గురు కలిసి ఆదివారం మధ్యాహ్నం ఆటోలో హిమాయత్ సాగర్కు వెళ్లారు. గేట్ల వద్ద ఉన్న నీటి గుంతలో వలలతో చేపలు పట్టసాగారు. నీటి లోతు తెలియని షాబాజ్, సల్మాన్, సమీర్ మరింత లోపలికి దిగారు. ఈత రాకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్నవారు గమనించి సమాచారం ఇవ్వడంతో రాజేంద్రనగర్ పోలీసులు చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించి సాయంత్రానికి షాబాజ్ మృతదేహాన్ని వెలికితీయించారు. సమీర్ను రక్షించారు. నీటిలో గల్లంతైన సల్మాన్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. హిమాయత్ సాగర్లో చేపల వేటను పోలీసులు నిషేధించి.. హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. అయినా.. చేపల వేటకు అడ్డుకట్ట పడటంలేదు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.


